మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి

ABN , First Publish Date - 2022-06-27T06:40:28+05:30 IST

యువత మాదక ద్రవ్యాల భారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని జిల్లా న్యాయమూర్తి భీమారావు, ఎస్పీ నిశాంత్‌రెడ్డి కోరారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
జిల్లా జడ్జి భీమారావుకు మాదకద్రవ్యాలను చూపుతున్న పోలీస్‌ అధికారులు

యువతకు జిల్లా జడ్జి సూచన 

చిత్తూరు, లీగల్‌, జూన్‌ 26: యువత మాదక ద్రవ్యాల భారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని జిల్లా న్యాయమూర్తి భీమారావు, ఎస్పీ నిశాంత్‌రెడ్డి కోరారు. చిత్తూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన సమావేశంలో వీరు మాట్లాడారు. మాదక ద్రవ్యాల వాడకంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయన్నారు. యువకులు చదువులు, జీవనోపాధి కోల్పోయి నిర్భాగ్యులవుతారని హెచ్చరించారు. నేర ప్రవృత్తి ఏర్పరుచుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల సహాయంతో పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. యువత వ్యక్తిగత స్వాతంత్రాన్ని కోరుకోవడంలో తప్పులేదని కానీ మాదకద్రవ్యాల బారినపడితే దేశ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందన్నారు. యువత దేశానికి బలమని అలాంటి వారికి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన యువతను మార్చేందుకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలని అన్నారు. నల్లమందు, హెరాయిన్‌, గంజాయి, కొకైన్‌ మొదలైన వాటి గురించి ప్రజలకు ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలన్నారు. జిల్లా న్యాయశాఖ సెక్రటరీ కరుణకుమార్‌, న్యాయమూర్తులు శాంతి, శ్రీనివాసరావు, శ్రీనివాస్‌, రవి, ఏఎస్పీ జగదీష్‌ పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T06:40:28+05:30 IST