రైతులకు రూ.115.25 కోట్లు: కలెక్టర్
ABN , First Publish Date - 2022-05-17T06:21:50+05:30 IST
నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ రైతుభరోసా - పీఎం కిసాన్ పథకం పెట్టుబడి సాయం కింద 2,09,381 మంది రైతుల ఖాతాల్లో రూ.115.25 కోట్లు జమ చేశామని కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పేర్కొన్నారు.
నంద్యాల టౌన్, మే 16 : నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ రైతుభరోసా - పీఎం కిసాన్ పథకం పెట్టుబడి సాయం కింద 2,09,381 మంది రైతుల ఖాతాల్లో రూ.115.25 కోట్లు జమ చేశామని కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పేర్కొన్నారు. సోమవారం ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి 4వ విడత రైతుభరోసా పథకం కింద 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.37.58 కోట్లు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో లైవ్లో వీక్షించారు. కలెక్టర్తో పాటు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జడ్పీ ఛైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, మార్క్ఫెడ్ ఛైర్మన్ పీపీ నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ మండలి చైౖర్మన్ శివరామిరెడ్డి తదితరులు వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ప్రభుత్వం సాయంగా అందిస్తున్నదని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఎంపికైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలివిడతగా రూ.7,500 జమ చేస్తా మని అన్నారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో 43,272 మంది రైతుల కుటుంబాలకు రూ.23.80 కోట్లు, బనగానపల్లె నియోజకవర్గంలో 40,147 మంది రైతులకు రూ.22.09 కోట్లు జ మ చేసినట్టు చెప్పారు. డోన్ నియోజకవర్గంలో 34,822 మందికి రూ.19.16 కోట్లు, నందికొట్కూరులో 37,770 మందికి రూ.20.78 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. నంద్యాలలో 13,784 మందికి రూ.7.5 కోట్లు, పాణ్యంలో 13,837 మందికి రూ.7.6కోట్లు, శ్రీశైలంలో 25,747మందికి రూ.14.21కోట్లు.. మొత్తం 2,09,381 మంది రైతుల ఖాతాల్లో రూ.115.25 కోట్లు జమ చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలను పటిష్టం చేసి రైతులకు పురుగుల మందులు, రసాయన ఎరువులు, నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తామని తెలిపారు. అంతకు ముందు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ను, వ్యవసాయ యంత్ర పనిముట్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రావు, ఉద్యానవన శాఖ అధికారి రమణయ్య, ఇతర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.