ఆయిల్ పామ్ వైపు అడుగులు
ABN , First Publish Date - 2022-06-27T06:15:00+05:30 IST
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలను వేగంతం చేసింది. రాష్ట్రంలో పత్తి సాగు పెరగడంతో ఇబ్బందిగా మారిందని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. వరి సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినా.. సాగుకు రైతు లు అంతగా ముందుకు రావడం లేదు. దీంతో లాభదాయక పంటల సాగు వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
జిల్లాలో 3,876 హెక్టార్లలో సాగు లక్ష్యం
ఈ యేడు నర్సరీల్లో 60 ఎకరాల్లో మొక్కల పెంపకం
సబ్సిడీపై డ్రిప్, మొక్కలు, ఎరువుల పంపిణీ
ఆసక్తి చూపుతున్న అన్నదాతలు
జిల్లావ్యాప్తంగా మొత్తం 92 మంది రైతుల ఎంపిక
తలమడుగు, జూన్ 26: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలను వేగంతం చేసింది. రాష్ట్రంలో పత్తి సాగు పెరగడంతో ఇబ్బందిగా మారిందని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. వరి సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినా.. సాగుకు రైతు లు అంతగా ముందుకు రావడం లేదు. దీంతో లాభదాయక పంటల సాగు వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలో అవసరాల కు సరిపడా నూనె గింజల ఉత్పత్తి లేకపోవడం, పామాయిల్ను విదేశా ల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆంధ్రా లో మాదిరిగా తెలంగాణలో కూడా పామాయిల్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కోసం కొన్ని కంపెనీలను గుర్తించి వాటి ఆధ్వర్యంలోనే ఆయా జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని తలపెట్టింది. జిల్లా పరిధిలోని 3,876 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలో 2022-23 సంవత్సరానికి గాను 3,876 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ప్రాసెసింగ్ బాధ్యతలను మలేషియాకు చెందిన ట్రీ యూనిక్ ఇండియా సంస్థకు అప్పగిస్తూ 2020లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వా త ఆ సంస్థ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును చేపడుతోంది. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఉద్యానవన శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది
నర్సరీల ఏర్పాటు
జిల్లాలోని తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల మధునాపూర్ శివారులో నర్సరీలను ఏర్పాటు చేసింది. ఆ నర్సరీల్లో 5లక్షల నుంచి10 లక్షల మొక్కలను 60 ఎకరాలలో పెంచుతున్నారు. ఒక్కో నెలలో ఒక్క ఆకు చొప్పున 12నెలలో 12 ఆకులు వచ్చిన తర్వాత.. మొక్కలను నాటాల్సి ఉంటుంది. నాలుగు నెలల క్రితం నర్సరీలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టగా వచ్చే జనవరి నాటికి ఈ మొక్కలను పంపిణీ చేసి సాగుకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఈ సంవత్స రం 3,876 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 60 ఎకరాల్లో నర్సరీని ఏర్పా టు చేసి అందులో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. కాగా జూన్ లో 342హెక్టార్లు, జూలైలో 1026 హెక్టార్లు, నవంబరులో 1140, డిసెంబరు లో 1368 హెక్టార్లు.. మొత్తం 3,876 హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారు. కాగా ఇందుకు 92 మంది రైతులను ఎంపిక చేశారు.
30ఏళ్ల వరకు ఆదాయం
నీరు నిలువని లోతైన నల్లరేగడి నేలలు, అధిక సేంఛ్రీటయ పదార్థం కలిగి, నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగి ఉండి నీరు సమృద్ధిగా ఉన్న సారవంతమైన నేలలో ఆయిల్ పామ్ సాగు చేస్తే.. నాలుగు సంవ త్సరాల నుంచి 30ఏళ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చు. నాలుగేళ్ల తర్వాత ప్రతీ రెండు నెలలకు ఎకరానికి టన్ను చొప్పున యేడాదిలో ఆరు టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుత మార్కెట్లో క్వింటాలు ఆయిల్ పామ్ కాయలకు రూ.20వేల చొప్పున, ఆరు టన్నులకు రూ.లక్షా 20వేల చొప్పున ఆ దాయం వస్తుందని చెబుతున్నారు. ఒక ఎకరం భూమిలో 57 మొక్కల చొప్పున నాటి డ్రిప్ ద్వారా మొక్కలు ఎండిపోకుండా నీరు సమృద్ధిగా అందిస్తే నాలుగేళ్ల తర్వాత క్రాప్ మొదలవుతుంది. మొదటి సంవత్సరం ఎకరానికి 50వేల నుంచి లక్ష రూ పాయలు, రెండో సంవత్సరం నుంచి కాత వచ్చే వరకు పెద్దగా పెట్టుబడి అవసరముండదు. మూడేళ్ల వరకు మొక్కల మధ్య మొక్కజొన్న, అరటి, పొద్దుతిరుగుడు, మిరప, సోయాబీన్, పసుపు, పూలు, పెనేలు, మినుము, ఆనందలు, నువ్వులు, వేరుశనగ, కూరగాయలు వంటి తదితర పం టలు సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. అకాల వర్షాలు, గాలివాన బీ భత్సం వచ్చినా సాగుకు నష్టముండదని, కేవలం నీరు ఉంటే చాలు, పశువులు, కోతులు కూడా పంటనష్టం చేయలేవని రైతులు చెబుతున్నారు.
ప్రభుత్వ రాయితీలు
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు, సబ్సిడీలు అందిస్తోంది. సబ్సిడీ ధరలతో మొక్కలను పంపిణీ చేయడంతో పాటు ఎరువులను కూడా ఇస్తోంది. హెక్టారు భూమిలో డ్రిప్ ఏర్పాటు చేసేందుకు అయ్యే వ్యయం రూ.53,465 ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తోంది. డ్రిప్ ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ, అలాగే బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఓసీలకు 80 శాతం సబ్సిడీ అందిస్తారు.
ఆయిల్ పామ్ ప్రయోజనాలు..
నాటిన నాలుగేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు నిరంతర ఆదాయం
పంట ఫల సాయం మధ్య దళారీలు లేకుండా ప్రభుత్వం
నిర్ణయించిన ధరలకే ట్రీ యూనిక్ సంస్థ కొనుగోలు చేసి
ఎప్పటికప్పుడు రైతు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తుంది.
అనుభవజ్ఞులైన క్షేత్ర సిబ్బంది ద్వారా సాంకేతిక
సలహాలను అందిస్తారు.
చీడ పీడల బెడద తక్కువ.
అంతర్ పంటలతో అదనపు ఆదాయం సమకూరుతుంది.
అర్హత గల రైతులకు బ్యాంకులు హెక్టారుకు (రెండున్నర
ఎకరాలకు) 1.2లక్షల వరకు తొమ్మిది ఏళ్ల ధీర్ఘకాలిక
రుణ సదుపాయం కల్పి స్తోంది.
గత కొన్నేళ్లుగా పత్తి సాగుతో విసిగి పోయాం
: కాటిపెల్లి రాంరెడ్డి, రైతు, తలమడుగు
గత కొన్ని సంవత్సరాలుగా పత్తి పంటను సాగు చేసి విసిగి పోయాం. పత్తి పంట సాగు చేసేందుకు కూలీల కొరత, చీడపీడలు, పురుగుల బెడద వీటన్నింటితో విసుగు చెందాం. రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడి పద్ధతిని అవలంభించి లాభదాయక పంటలను సాగు చేయాలని సూచించడంతో జిల్లా ఉద్యానవన శాఖ అధికారుల సహకారంతో ఐదు ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేసేందుకు సిద్ధంగా భూమిని చదును చేశా. ఆయిల్ పామ్ పంటపై మరింత రైతులకు అవగాహన కల్పించాలి.
ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నాం
: శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఈ సంవత్సరం జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు 60 ఎకరాల్లో నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచాం. విడతల వారీగా రైతులను ఎంపిక చేసి ఆయిల్ పామ్ మొక్కలను అందించడం జరుగుతుంది.