కడుపు మాడ్చి.. కాటికి పంపారు!

ABN , First Publish Date - 2021-07-26T09:05:47+05:30 IST

కొడుకులెందరున్న గానీ.. కడుపు నిండని దైన్యం ఆ తల్లిది!. ఏడు పదుల వయసులో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు.

కడుపు మాడ్చి.. కాటికి పంపారు!

  • అన్నం కూడా పెట్టని కొడుకులు
  • ఆర్టీసీ బస్సు టైరు కింద తలపెట్టి తల్లి ఆత్మహత్య 

కొనకనమిట్ల, జూలై 25: కొడుకులెందరున్న గానీ.. కడుపు నిండని దైన్యం ఆ తల్లిది!. ఏడు పదుల వయసులో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు.. ఆమెపై కాఠిన్యం ప్రదర్శించారు. ఆలనాపాలనా అటుంచి కనీసం అన్నం కూడా పెట్టలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ తల్లి ఆర్టీసీ బస్సు టైరు కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లా పెదారికట్లలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. పెదారికట్లకు చెందిన గొడ్డేటి పిచ్చమ్మ (70)కు నరసింహం, వెంకటనరసయ్య ఇద్దరు కుమారులు. భర్త పదేళ్ల క్రితం మృతి చెందారు. ఆతర్వాత కుమారులు ఆమె బాగోగులు అస్సలు పట్టించుకోలేదు. కొంతకాలం క్రితం వరకూ పిచ్చమ్మ కూలి పనులకు వెళ్లి.. వచ్చిన డబ్బుతో కడుపు నింపుకొనేది. వయోభారంతో ఇటీవల పనులకు వెళ్లలేకపోతోంది. అయినప్పటికీ కొడుకులు ఆమెపట్ల కనీస జాలి చూపడంలేదు. గ్రామస్థులు ఎవరైనా భోజనం పెడితే తినడం, లేకపోతే పస్తులుండటం. మానసికంగానూ కుంగిపోయింది. ఈ నేపథ్యంలో పిచ్చమ్మ ఆదివారం ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ ఆర్టీసీ బస్సు ఆగి ప్రయాణికులు దించి కదులుతున్న సమయంలో వెనుకవైపు టైరు కింద తలపెట్టేసింది. దీంతో పిచ్చమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.

Updated Date - 2021-07-26T09:05:47+05:30 IST