తెలంగాణపై విషం చిమ్మడం మానండి

ABN , First Publish Date - 2022-04-22T08:51:20+05:30 IST

తెలంగాణపై విషం చిమ్మడం మానండి

తెలంగాణపై విషం చిమ్మడం మానండి

  • మిల్లుల్లో బియ్యం మాయమయ్యాయన్న
  •  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వాఖ్యలు అవాస్తవం
  • ఏ విచారణకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం: గంగుల 


కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 21: ‘‘తెలంగాణ ప్రజలపై, రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు..తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీయాలని చూస్తున్నారు.. తెలంగాణ ప్రజల ఓట్లతో ఢిల్లీ గద్దెపై కూర్చొని తెలంగాణ ప్రజలను అవమానించేలా కిషన్‌రెడ్డి మాట్లాడడం సరికాదు.. నీచమైన ఈ విధానాన్ని మానుకోవాలి’ అని పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హితవు పలికారు. గురువారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్‌సీఐ, సివిల్‌ సప్లయీస్‌ విషయాలపై అవగాహన లేకుండా అబద్ధాలు మాట్లాడారన్నారు. ఎఫ్‌సీఐకి, కేంద్రానికి సంబంధించిన బియ్యం మన రైసుమిల్లుల్లో మాయమైందని కిషన్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ ఆరోపణలపై సీబీఐ, ఈడీ దేనితోనైనా విచారణ జరిపించుకోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. అయినా రైస్‌ మిల్లుల్లో ఉన్నప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ ధాన్యమేనని, ఎప్‌సీఐకి గోదాంలోకి వెళ్లినప్పుడే కేంద్రానికి సంబంధించినవి అవుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు వడ్లు కొంటుందని, ఇందులో కేంద్రం పాత్ర ఉండదన్నారు. వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇచ్చాకే వాటికి సరిపడా డబ్బులును నాలుగు నెలల తర్వాత ఇస్తుందనే వాస్తవాన్ని కిషన్‌రెడ్డి తెలుసుకోవాలన్నారు. ఎఫ్‌సీఐ రాష్ట్రంలోని రైస్‌మిల్లులను తనిఖీలు చేయగా 4,53,000 బస్తాలు తక్కువ ఉన్నాయని చెప్పారని, 2021 యాసంగి, వానా కాలం కలిపి 40.50 కోట్ల  బస్తాల వడ్లను సేకరించామని, ఇందులో కిషన్‌రెడ్డి చెప్పింది...0.001 శాతమని అన్నారు. ఇది కూడా తప్పుడు సమాచారమేనని అన్నారు. 

Updated Date - 2022-04-22T08:51:20+05:30 IST