పొదిలిలో ఆగిన పొగాకు వేలం
ABN , First Publish Date - 2021-04-24T05:08:44+05:30 IST
గిట్టుబాటు ధరలు కల్పించడం లేదంటూ పొదిలి పొగాకు వేలంకేంద్రంలో రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దళారులతో కుమ్మక్కై ధరలు ఇవ్వడం లేదంటూ వేలాన్ని పారు. ఎఫ్-1, ఎఫ్-2 గ్రేడ్లు ఏర్పాటు చేసి రూ.180 నుంచి రూ.160 వరకు ధరలను తగ్గించి వేస్తున్నారన్నారు
దళారులతో కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారంటూ రైతుల ఆందోళన
వేలం ఆపి షట్టర్లు వేసిన వైనం
పొదిలి రూరల్, ఏప్రిల్ 23: గిట్టుబాటు ధరలు కల్పించడం లేదంటూ పొదిలి పొగాకు వేలంకేంద్రంలో రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దళారులతో కుమ్మక్కై ధరలు ఇవ్వడం లేదంటూ వేలాన్ని పారు. ఎఫ్-1, ఎఫ్-2 గ్రేడ్లు ఏర్పాటు చేసి రూ.180 నుంచి రూ.160 వరకు ధరలను తగ్గించి వేస్తున్నారన్నారు. అదేరకం బేళ్ళకు ఎఫ్-3, ఎఫ్-4గా గ్రేడ్లు ఏర్పాటు చేసి రూ.120, రూ.110ధరలు వేస్తున్నారని వాపోయారు. అందులో కొద్ది తేడాతో ఉన్న బేళ్ళను ఎఫ్-4, ఎఫ్-5గా కేటాయించి రూ.100, రూ.90 ధర ఇస్తున్నారని, ఇంచుమించు ఒకేరకం పొగాకుకు మూడు రకాల ధరలను నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేలం నిర్వహించేది లేదని రైతులు స్పష్టం చేశారు. చెమటోడ్చి పండించిన పంటను మార్కెట్లోకి తీసుకువచ్చే సరికి గిట్టుబాటు ధర కల్పించడంలో అధికారులు విఫలమౌతున్నారని విమర్శించారు. వ్యాపారులు, అధికారులు సిండికేట్ అయ్యి గిట్టుబాటు ధరలు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వేలంకేంద్రం షట్టర్లు మూసి నిరసన వ్యక్తం చేశారు.
నాణ్యమైన పొగాకును తీసుకురావాలి
- రవికాంత్, వేలం నిర్వాహణాధికారి
ధరల విషయంలో వ్యత్యాసం లేదు. కానీ ఎఫ్-1 నుంచి ఎఫ్-5 వరకు వచ్చే పొగాకులో కొన్ని రకాలు ఉంటాయి. నాణ్యతలో తేడా ఉంటుంది. రైతులు నాణ్యమైన పొగాకు తీసుకువస్తే మంచి ధర పలుకుతుంది. అయితే చివరిలో తేవాల్సిన ఆకును మొదటిలోనే కలిపి తెస్తున్నారు. అందువల్ల ధరలో వ్యత్యాసం కనిపిస్తుంది. దాన్ని రైతులు గమనించకుండా వ్యక్తిగతమైన విషయాలతో వేలం ఆపడం సరికాదు.