కన్నుపడితే కబ్జా

ABN , First Publish Date - 2022-08-14T05:51:38+05:30 IST

ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాల్సిన భూమిపై కొంత మంది పెద్దలు కన్నేశారు.

కన్నుపడితే కబ్జా
చేపలచెరువుగా మార్చిన ప్రభుత్వభూమి

రాత్రికి రాత్రే చేపల చెరువుగా మారిన కోటి విలువైన భూమి


కైకలూరు, ఆగస్టు 13 : ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాల్సిన భూమిపై కొంత మంది పెద్దలు కన్నేశారు. కోటి విలువైన ఈ భూమిని రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రే చేపల చెరువుగా మార్చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కైకలూరు మండలం ఆలపాడు సోమేశ్వరంలో జాతీయ రహదారికి దగ్గరలో నాలుగు దశాబ్దాల క్రితం ఇళ్ల స్థలాల కోసం 1.75 ఎకరాల గ్రామ కంఠం భూమిని కేటాయించారు. ఆ సమయంలో కొందరు పూరి గుడిసెలు వేసుకుని జీవనం సాగించేవారు. పల్లపు ప్రాంతంలో ఇళ్ల స్థలం ఉండడంతో ఏటా ముంపునకు గురవుతున్నారని, 1985లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా, రాష్ట్ర గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషి దీనిని ఇందిరా కాలనీగా గుర్తిస్తూ జాతీయ రహదారికి  మరోవైపున ఇళ్ల స్థలాలు కేటాయించారు. అప్పటి నుంచి ముంపు భూమి ఖాళీగా ఉంటుంది. అనతి కాలంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి, గ్రామ పంచాయతీ డంపింగ్‌ యార్డు నిర్మాణానికి అధికారులు ఈ స్థలాన్ని ప్రతిపాదించారు. సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంతో ఎలాంటి పనులు చేపట్టలేదు. ఇటీవల జగనన్న కాలనీల నిర్మాణానికి ఈ స్థలాన్ని పరిశీలించినప్పటికీ లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇదే అదనుగా నాలుగు దశాబ్దాల క్రితం పట్టాలు పొందిన కొందరు అదే గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులకు అమ్మినట్లు సమాచారం. జాతీయ రహదారికి సమీపంలో ఉండడం వల్ల ఆ భూములు ఎకరం భూమి రూ.60 లక్షల ధర పలుకుతోంది. గ్రామ అవసరాలకు వినియోగించాల్సిన భూమిని కబ్జా చేసిన వారిపై, అధికారులు చర్యలు తీసుకుని దీనిని పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ‘సోమేశ్వరంలో గ్రామ అవసరాలకు వినియోగించే భూమిని చేపల చెరువుగా తవ్వకాలు చేసినట్లు నా దృష్టికి వచ్చింది. దీనిపై తదుపరి పనులు నిర్వహించకుండా గ్రామ వీఆర్వో, వీఆర్‌ఏలతో కాపలా పెట్టించాం. అలాగే తవ్విన వారిని గుర్తించి చర్యలు చేపడతాం’ అని తహసీల్దార్‌ మురళీకృష్ణ తెలిపారు. 

Updated Date - 2022-08-14T05:51:38+05:30 IST