తెగుతున్న గట్లు
ABN , First Publish Date - 2022-05-16T06:40:39+05:30 IST
మండలంలో ఉప్పుటేరు వెంబడి ఉన్న గట్లు కోతకు గురై ప్రమాదకరంగా ఉన్నాయి.
ప్రమాదకరంగా ఉప్పుటేరు మార్జిన్లు
చెరువు ఆక్రమణలతో బలహీనం
కలిదిండి, మే 15 : మండలంలో ఉప్పుటేరు వెంబడి ఉన్న గట్లు కోతకు గురై ప్రమాదకరంగా ఉన్నాయి. దీంతో తుఫాన్లు సంభవించినప్పుడు ఏ క్షణంలో గండ్లు పడి గ్రామాలను ముంచెత్తుతుందోనని ఉప్పుటేరు తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సంభవించిన అసాని తుఫాన్కు ఉప్పుటేరు పొంగింది. ఈ పరిస్థితుల్లో గండ్లు పడితే గ్రామాల్లోకి ఉప్పుటేరు ప్రవహించి ఇళ్లు మునుగుతాయని ఉప్పుటేరు తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉప్పుటేరు వెంబడి చినతాడినాడ, సున్నంపూడి, దుంపలకోడు దిబ్బ, కొండంగిపల్లి పాలెం, మట్టగుం, పెదలంక గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 25 వేల జనాభా నివ శిస్తున్నారు. వీరిలో మత్స్యకారులు అధికం. ఆకివీడు వంతెన నుంచి పెద లంక పల్లిపాలెం వరకు 25 కిలోమీటర్ల మేర ఉప్పుటేరు మార్జిన్ను కొంతమంది బడాబాబులు ఆక్రమించి చేపలు, రొయ్యలు చెరువుల తవ్వే శారు. దీంతో ఉప్పుటేరు కట్ట బలహీన పడింది. ఉప్పుటేరు ఏటిగట్టును ఆక్రమించి చెరువులుగా తవ్వుతున్నా సంబంధిత అధికారులు పట్టించు కోవటం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తునారు. పలు గ్రామాల్లో ఏటి గట్టు మట్టిని ట్రాక్టర్ల ద్వారా తమ అవసరాలకు ఉపయో గించుకుంటున్నారు. చెరువులు తవ్వే సమయంలో డ్రైయినేజీ అధి కారులు తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.