గౌతమి పాత బ్రిడ్జి సామర్ధ్యం పెంపు!
ABN , First Publish Date - 2021-10-18T05:46:07+05:30 IST
జాతీయ రహదారి 16పై జొన్నాడ-రావులపాలెం గౌతమి పాత బ్రిడ్జి సామర్ధ్యం పెంచడంపై నేషనల్ హైవే అథారిటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 1967లో నిర్మించిన ఈ బ్రిడ్జిపై 2003 వరకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించేవి.
- ప్రత్యేక దృష్టిసారించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు
- దాదాపు ఏడాది పడుతుందంటున్న నిపుణులు
- పనులతో ట్రాఫిక్ ఇబ్బందులు
ఆలమూరు, అక్టోబరు 17: జాతీయ రహదారి 16పై జొన్నాడ-రావులపాలెం గౌతమి పాత బ్రిడ్జి సామర్ధ్యం పెంచడంపై నేషనల్ హైవే అథారిటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 1967లో నిర్మించిన ఈ బ్రిడ్జిపై 2003 వరకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించేవి. 2003లో జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడంతో జొన్నాడ వద్ద పాత బ్రిడ్జి పక్కనే మరో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. దీంతో దానికి కొంతమేర ఊరట లభించింది. పాత బ్రిడ్జి నిర్మాణం చేసి 50ఏళ్లు పైబడటంతో సామర్ధ్యం పెంపుదల చేయాలని నిర్ణయించి ఈ ఏడాది మార్చిలో రీహాబిటేషన్ పనులను మొదలు పెట్టారు. గోదావరి నుంచి పైకి ఉన్న స్తంభాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యంత్రాలతో నదీ భాగం నుంచి పైవరకు ఉన్న స్తంభానికి సామర్ధ్యం పెంచే పనులు చేపడుతున్నారు. ఒక్కో స్తంభాన్ని రిపేరు చేయడానికి నాలుగైదు రోజులు పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ బ్రిడ్జికి 49 స్తంభాలు ఉన్నాయి. దీంతో పది నుంచి 12 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు పాత బ్రిడ్జికి రిపేర్లతో గత ఐదారు నెలలుగా ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. బ్రిడ్జికి ఇరువైపులా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడంతో వాహనాలు ఒకదాని వెనుక మరొకటి వెళ్లాల్సి వస్తోంది. ఓఎన్జీసీతో పాటు ఇతర భారీ వాహనాలు బ్రిడ్జి దాటడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఆ సమయాల్లో వాహనచోదకుల ఇక్కట్లు వర్ణనాతీతం.