కోడలి టికెట్ కోసం ఒత్తిడి
ABN , First Publish Date - 2022-01-18T07:00:11+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉత్తరాఖండ్ బీజేపీ
మంత్రిని పార్టీ నుంచి తప్పించిన బీజేపీ
డెహ్రాడున్/పణజి, జనవరి 17: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉత్తరాఖండ్ బీజేపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తనతోపాటు తన కోడలికి అసెంబ్లీ ఎన్నికల టికెట్ ఇవ్వాలని హైకమాండ్పై ఒత్తిడి తీసుకొచ్చిన అటవీ, కార్మిక శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్ను పార్టీ నుంచి తప్పించింది. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆరేళ్ల పాటు అనర్హుడిని చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా చర్యల కింద హరక్ను పార్టీ నుంచి తొలగించామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సోమవారం ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి హరక్కు అన్ని విధాల సహకరించామని, కానీ వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని పుష్కర్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు.
కాంగ్రె్సను వీడి 2016లో బీజేపీలో చేరిన హరక్ సింగ్, తిరిగి కాంగ్రె్సలో చేరేందుకు హరక్ వెంటనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ పార్టీ నేతలతో సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇక.. ఉత్తరాఖండ్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరిత ఆర్య సోమవారం బీజేపీలో చేరారు. నైనిటల్ నుంచి కాంగ్రెస్ టికెట్ను నిరాకరించడంతో ఆమె బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)తో తాము పొత్తు పెట్టుకోవడం లేదని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) గోవా ఇన్చార్జి దినేశ్ గుండు రావు సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో గోవాలో అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.