జాతరలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2021-03-07T04:43:31+05:30 IST
ఈ నెల 14, 15, 16వ తేదీల్లో అనంతపురం గ్రామంలో జరుగు గంగమ్మ జాతరలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ యుగంధర్ పేర్కొన్నారు.
లక్కిరెడ్డిపల్లె, మార్చి6: ఈ నెల 14, 15, 16వ తేదీల్లో అనంతపురం గ్రామంలో జరుగు గంగమ్మ జాతరలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ యుగంధర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమ్మవారికి మొక్కుబడులు, చాందినీ బండ్లు ఏర్పాటు చేసేవారు ముందుగా పోలీసుల అనుమతి పొందాలన్నారు. పది అడుగుల్లో ఉండాలని, డ్రైవర్ లైసెన్స్ అన్ని అర్హతలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. అలాగే జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 400 మందికిపైగా పోలీసులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ట్రాఫిక్ను అరికట్టేందుకు రాయచోటి- పులివెందుల వైపు నుంచి వచ్చే బస్సులు మర్రిమాను దారి మళ్లిస్తారని, అలాగే రాయచోటి- కడప నుంచి వచ్చే బస్సులు రోడ్డు పక్క ఏర్పాటు చేస్తామని ఆయన సూచించారు. అశ్లీలత నృత్య ప్రదర్శనలు చాందినీ బండి ముందుకు ప్రదర్శించకూడదన్నారు. అలాగే చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.