ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్న స్టూడెంట్ లేఖ

ABN , First Publish Date - 2021-03-05T21:06:04+05:30 IST

ఆత్మీయులను కోల్పోతే.. ఆ బాధ వర్ణనాతీతం. రోజులు గడస్తున్నా...

ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్న స్టూడెంట్ లేఖ

ఆత్మీయులను కోల్పోతే.. ఆ బాధ వర్ణనాతీతం. రోజులు గడస్తున్నా... దాన్నుంచి బయటపడటం కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో ఏ చిన్న ఓదార్పు దక్కినా.. మనసెంతో తేలిక పడుతుంది. అలాంటి ఓ గొప్ప ఓదార్పు.. అమెరికాలోని ఓ టీచర్‌కు దక్కింది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ టీచర్‌ను.. ఓ విద్యార్థిని ఓదార్చిన తీరు యావత్ ప్రపంచాన్ని కట్టిపడేస్తోంది. 


మసాచుసెట్స్‌కు చెందిన టీచర్ మెలిసా మెల్నెర్ తనకందిన ఓ లేఖను ట్వీట్ చేశారు. అది ఆమె స్టూడెంట్ రాసినది. ఓ చక్కని డ్రాయింగ్ వేసి.. ఆమెను ఓదార్చుతూ రెండు వాక్యాలు రాసింది సదరు స్టూడెంట్.  


‘‘డియర్ మిసెస్ మిల్నర్, మీరు మీ భర్తను కోల్పోవడం బాధాకరం. మీరు ఇకపై మీ శ్రీవారిని చూడలేకపోవచ్చు. కానీ.. ఎల్లప్పుడూ మీ హృదయాల్ని కలిపి ఉంచే ఓ సన్నని రేఖ మీ మధ్య ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఈ విషాదం నుంచి బయటపడగలరని విశ్వసిస్తున్నాను’’ అని అని లేఖలో పేర్కొంది.


ఈ అక్షరాలు లక్షలాది మందిని కదిలించాయి. విషాదంలో మునిగిన తన టీచర్‌ను ఓదార్చడానికి మంత్రాల్లాంటి మాటలు చెప్పిందంటూ నెటిజన్లు సదరు విద్యార్థినిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  



Updated Date - 2021-03-05T21:06:04+05:30 IST