ఫెయిలవుతాననే భయంతో విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-21T15:29:12+05:30 IST
పరీక్షల్లో ఫెయిలవుతాననే భయంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కానీ ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణురాలైనట్లు తేలడంతో తల్లిదండ్రులు
- 344 మార్కులతో పాస్
వేలూరు(చెన్నై), జూన్ 20: పరీక్షల్లో ఫెయిలవుతాననే భయంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కానీ ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణురాలైనట్లు తేలడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తిరుపత్తూర్ జిల్లా ఆలంగాయం సమీపం నాయకన్నూర్ కొల్లకొట్టాయం ప్రాంతానికి చెందిన రైతు అరివయగన్ కుమార్తె షీభాశ్రీ (17) ఆలంగాయంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్ టూ చదువుతోంది. పబ్లిక్ పరీక్షలు ముగిసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఆమె, ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులతో తాను ఫెయిలవుతాననే భయం ఉందనడంతో వారు సమాధానపరిచారు. కొంతసేపటికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె ఎంత వరకు తిరిగి రాకపోవడంతో భయపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఆ ప్రాంతంలోని బావిలో ఎవరో దూకిన శబ్దం విన్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. రాత్రి కావడంతో సోమవారం ఉదయం అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉదయం 10 గంటలకు బావి నుంచి షీభాశ్రీ మృతదేహాన్ని వెలికితీశారు. పరీక్షల్లో ఫెయిలవుతాననే భయంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కావలూరు పోలీసుల విచారణలో తేలింది. కాగా, సోమవారం వెలువడిన ఫలితాల్లో షీభాశ్రీ 344 మార్కులతో ఉత్తీర్ణురాలైంది