విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-26T16:55:35+05:30 IST
తోటి విద్యార్థిని నోటు బుక్కులో ఏదో రాసిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్/పహాడిషరీప్: తోటి విద్యార్థిని నోటు బుక్కులో ఏదో రాసిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఈవిధంగా ఉన్నాయి. జల్పల్లి శ్రీరాంకాలనీలో నివాసముండె కె.రాములు కుమారుడు కె. యశ్వంత్ శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 23న పాఠశాలకు వెళ్లిన ఆ బాలుడు మరో ఇద్దరు బాలురతో కలిసి తన తరగతికి చెందిన ఓ బాలిక వద్ద రాసుకోవడానికి నోట్ బుక్కు తీసుకున్నాడు. ఆ నోట్స్లో యశ్వంత్ ఏదో రాసి తిరిగి ఆ బాలికకు ఇచ్చాడు. అది చూసిన బాలిక టీచర్కు ఫిర్యాదు చేసింది. టీచర్ యశ్వంత్ను పిలిచి ప్రశ్నించింది. రేపు స్కూల్కు మీ నాన్నను తీసుకురావాలని చెప్పి పంపించింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు యశ్వంత్ తండ్రి రాములుకు 91820 69891 ద్వారా ఫోన్ చేసి మీ కుమారుడు ఓ బాలికకు ప్రేమ లేఖ రాశాడని, ఒక సారి స్కూల్కు వచ్చి మాట్లాడాలని చెప్పింది. ఇదే విషయాన్ని రాములు తన కుమారుడిని ప్రశ్నించగా తనకేమీ తెలియదని చెప్పాడు. తర్వాత రాములు పనిమీద బయటకు వెళ్లడం, అతని భార్య పనికి వెళ్లి ఇంకా ఇంటికి రాకపోవడంతో ఒంటరిగా ఉన్న యశ్వంత్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ మందలించిన కారణంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని రాములు పహడీషరీప్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.