విద్యార్థులకు మాస్క్ తప్పనిసరి
ABN , First Publish Date - 2022-07-02T13:05:14+05:30 IST
విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో, గత నెల 12వ తేది నుంచి
- పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
పెరంబూర్(చెన్నై), జూలై 1: విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో, గత నెల 12వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. కానీ, కొద్దిరోజులుగా రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ధారణ, భౌతిక దూరం పాటింపు తదితరాలు తప్పరిసరి చేయడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయినా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి తోడు పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితరాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం అందుతోంది. వారు కరోనా పరీక్షలు నిర్వహించనప్పటికీ లక్షణాలన్నీ అవే ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేలా పాఠశాల విద్యాశాఖ పలు నిబంధనలు విధించింది. పాఠశాల ప్రాంగణాల్లో వంద శాతం కరోనా నిబంధనలు పాటించాలని, విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది. విద్యార్థులు తరచూ చేతులు శుభ్రం చేసుకొనేలా శానిటైజేషన్ సదుపాయం ఏర్పాటుచేయాలని పాఠశాలల్ని ఆదేశించింది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది వచ్చే సమయంలో థర్మల్ స్కాన్ చేయాలని, శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే వారిని క్వారంటైన్లో ఉంచాలని సూచించింది. పాఠశాలల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, వెంటిలేటర్ బాగా ఉండే తరగతి గదుల్లో వారిని కూర్చోబెట్టాలని కూడా విద్యాశాఖ ఆదేశించింది.