హిజాబ్ ధరించిన విద్యార్థినులు.. తరగతి గదిలోకి అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2022-01-02T23:32:49+05:30 IST

ఉడుపిలోని ప్రభుత్వ మహిళా ప్రీయూనివర్సిటీ కళాశాల వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.

హిజాబ్ ధరించిన విద్యార్థినులు.. తరగతి గదిలోకి అనుమతి నిరాకరణ

బెంగళూరు: ఉడుపిలోని ప్రభుత్వ మహిళా ప్రీయూనివర్సిటీ కళాశాల వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థులను తరగతిలోకి అనుమతించేందుకు కళాశాల అధికారులు నిరాకరించారు. దీంతో విద్యార్థినులతో కలిసి ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు కలిసి జిల్లా కలెక్టర్‌ కుర్మారావును కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ప్రిన్సిపాల్‌తో మాట్లాడి జరిగిన ఘటనపై ఆరా తీశారు. 


తొలుత తమ తల్లిదండ్రులను తీసుకురావాలని కళాశాల అధికారులు చెప్పారని, వారొచ్చాక మూడు నాలుగు గంటలు బయట వేచి చూసేలా చేశారని ఓ విద్యార్థిని ఆరోపిస్తే.. తాము హిజాబ్ ధరించకముందు అంతా బాగానే ఉందని, కానీ ఆ తర్వాతే తమపై వివక్ష చూపుతున్నారని మరో విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఉర్దూలో కానీ, అరబిక్, బ్యారీ భాషలో కానీ చాట్ చేసేందుకు తమను అనుమతించడం లేదని ఆరోపించారు. దీనికి నిరసనగా తాము మూడు రోజులపాటు తరగతి గది బయట నిల్చున్నట్టు బాధిత విద్యార్థినులు చెప్పారు.  


వారు తమ హాజరు కూడా తీసుకోవడం లేదని, విద్యా సంవత్సరం చివర్లో హాజరు సమస్యను ఎదుర్కోవాల్సి  వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ రుద్ర గౌడ మాట్లాడుతూ.. స్కూలు ఆవరణలో విద్యార్థినులు హిజాబ్ ధరించుకోవచ్చని అయితే, తరగతి గదిలోకి మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు. దీనివల్ల తరగతి గదిలో ఏకరూపత దెబ్బతింటుందని పేర్కొన్నారు. 


హిజాబ్ ధరించిన విద్యార్థులను కనక తరగతి గదుల్లోకి అనుమతించకుంటే ఆందోళనకు దిగుతామని సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) ఉడుపి చీఫ్ నజీర్ అహ్మద్ హెచ్చరించారు. కళాశాల తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఘెరావ్ చేస్తామని కాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. 

Updated Date - 2022-01-02T23:32:49+05:30 IST