పాముల్లంకలో సబ్‌ కలెక్టర్‌ పల్లెనిద్ర

ABN , First Publish Date - 2021-07-26T06:56:58+05:30 IST

మండలంలోని పాముల్లంక లో ఆదివారం రాత్రి సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ పల్లెనిద్ర చేశారు.

పాముల్లంకలో సబ్‌ కలెక్టర్‌ పల్లెనిద్ర
ఆర్‌సీఎం పాఠశాలలో సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ పల్లెనిద్ర

తోట్లవల్లూరు, జూలై 25 : మండలంలోని పాముల్లంక లో ఆదివారం రాత్రి సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ పల్లెనిద్ర చేశారు. సాయంత్రం 5.30 గంటలకు వచ్చిన సబ్‌ కలెక్టర్‌ అధికారులతో కలిసి పడవలో కృష్ణానదిపాయను దాటి పాములలంకకు చేరుకున్నారు. ఆర్‌సీఎం ఎయిడెడ్‌ పాఠశాలను పరిశీలించారు. అసౌర్యాలతో ఉన్న మరుగుదొడ్లను చూశారు. గ్రామంలో ఇదొక్కటే పాఠశాలని గ్రామస్థులు తెలిపారు. అనంతరం ఆరోగ్య ఉప కేంద్రానికి వెళుతుంటే సీసీ రోడ్డులో అడుగులోతు మురుగు నీరు నిలిచి ఉంది. ఒకసారి వర్షం వస్తే పదిరోజుల పాటు మురుగుతో ఇబ్బంది పడుతున్నామని, రహదారిని అభివృద్ధి చేయాలని గ్రామస్థులు విన్నవించారు. రోడ్డుపై బురదనీటి పక్కగా ఆరోగ్య ఉపకేంద్రానికి చేరుకున్నారు. ఆరోగ్య ఉపకేంద్రానికి ఎఎన్‌ఎం లేరని, సచివాలయం ఎఎన్‌ఎం సేవలే లభిస్తున్నాయని సబ్‌ కలెక్టర్‌కు ప్రజలు చెప్పారు.   సచివాలయం ఎఎన్‌ఎం అనితను పిలిచి వివరాలు అడిగారు. లోపలికి వెళ్లి మందులను చూశారు. ప్రజలకు ఇచ్చే మందులను నిర్లక్ష్యంగా ఉంచారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య ఉప కేంద్రం శ్లాబు వర్షానికి తడిసిపోతోందని, మరమ్మతులు చేయాలని ప్రజలు కోరారు. కొన్ని ఇళ్లకు వెళ్లి పింఛన్‌ అందుతుందా, కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారా అని సబ్‌ కలెక్టర్‌ అడిగారు. ప్రజలందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు.  సబ్‌ కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ కె వెంకట శివయ్య, ఎంపీడీవో టి.స్వర్ణలత, సర్పంచ్‌ శీలం రమేష్‌, ఈవోపీఆర్‌డి రవికాంత్‌, డాక్టర్‌ మమత, కార్యదర్శి పిచ్చియ్య, పీఆర్‌ ఏఈ ఆర్‌ రాఘవరావు, వీఆర్వో బి నాగేశ్వరరావు, చంటిబాబు తదితరులు ఉన్నారు. 



Updated Date - 2021-07-26T06:56:58+05:30 IST