ఓపీ సిబ్బంది ఉదయం 7.45 కే విధుల్లో ఉండాలి
ABN , First Publish Date - 2021-11-26T06:29:53+05:30 IST
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఓపీ టోకెన్లు ఇచ్చే సిబ్బంది ప్రతిరోజూ ఉదయం 7.45 గంటలకే విధుల్లో ఉండాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్చంద్ స్పష్టం చేశారు.
ఓపీ సిబ్బంది ఉదయం 7.45 కే విధుల్లో ఉండాలి
ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన సబ్కలెక్టర్ ప్రవీణ్చంద్
విజయవాడ, నవం బరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఓపీ టోకెన్లు ఇచ్చే సిబ్బంది ప్రతిరోజూ ఉదయం 7.45 గంటలకే విధుల్లో ఉండాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్చంద్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఉదయం స్థానిక కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అప్పటికి కొంతమంది సిబ్బంది విధులకు హాజరుకాకపోవడాన్ని ఆయన గమనించారు. రోగులకు ఓపీ టోకెన్లు ఇచ్చే సిబ్బంది ఉదయం 7.45 గంటలకు విధుల్లో ఉండాలని ఆదేశించారు. ఓపీ రిజిస్ట్రేషన్, వెయిటింగ్ హాల్, వాష్ఏరియా, గైనిక్ వార్డు, స్కానింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రతను కాపాడాలని, వ్యర్థ పరికరాలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై.కిరణ్కుమార్, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ మంగాదేవి, నర్సింగ్ సిబ్బంది తదితరులు సబ్ కలెక్టరు వెంట ఉన్నారు.
ఇదే పనితీరును కొనసాగించండి
మహిళా బృందాన్ని అభినందించిన సబ్కలెక్టర్
వన్టౌన్: సంక్షేమ కార్యక్రమాలలో మంచి ప్రగతిని సాధించిన మహిళా బృందాన్ని విజయవాడ సబ్కలెక్టర్ ప్రవీణ్చంద్ అభినందించారు. గురువారం సబ్కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్మక్రమంలో ఆయన జగనన్న సంపూర్ణ గృహపథకంలో ఓటీఎస్ పై సమీక్ష నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా బాగా పనిచేసిన సిబ్బందిని ఉద్దేశించి ఇదే పనితీరును కొనసాగించాలని కోరారు. విజయవాడ రెవెన్యూ డివిజన్లో 95,828 మంది ఓటీఎస్ లబ్ధిదారులు ఉండగా, 82,993 మందిని ట్యాగ్ చేశారన్నారు. గురువారం వరకు 1285 మంది లబ్ధిదారులు రూ1,11,20,000 రుసుము చెల్లించారన్నారు. ఈ సందర్భంగా ఓటీఎస్ లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేశారు.