‘బీమా’ కేసులో ఏజెంట్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-10-01T05:29:49+05:30 IST
‘బీమా’ కేసులో ఏజెంట్ ఆత్మహత్య
బీమా డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడితో మనస్తాపం
నల్లబెల్లి, సెప్టెంబరు 30: వరంగల్ జిల్లా నందిగామ ఇన్సూరెన్స్ కుంభకోణం వ్యవహారంలో నిందితుడు, బీమా డబ్బుల విషయంలో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం. నందిగామకు చెందిన మహమ్ముద్ రఫీ(26) ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. తండ్రి గతంలోనే చనిపోగా తల్లి వద్దే ఉంటున్నాడు. ఇతడికి ఇంకా పెళ్లికాలేదు. నందిగామకు చెందిన భూక్య భాస్కర్ తన బంధువుకు రఫీ వద్ద రూ.36వేలు కట్టి బీమా చేయించాడు. బీమా చేయించుకున్న వ్యక్తి మృతి చెందడంతో ఇన్సూరెన్స్ క్లేయిమ్ కాలేదు. దీంతో మృతుడి బంధువులు భాస్కర్ను అడగ్గా, అతడు రఫీని నిలదీశాడు. ఇదే విషయమై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. దీంతో డిపాజిట్ చేసిన రూ.36వేలు ఇస్తానని ఒప్పుకోగా, అందులో ఆరు వేలు మొదట ఇచ్చాడు. మిగతా డబ్బుల కోసం భాస్కర్ స్థానిక నాయకులతో ఒత్తిడి తేవడంతో దీంతో మనస్తాపం చెందిన రఫీ ఈనెల 21న పురుగులు మందు తాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తల్లి చాంద్బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
బీమా కుంభకోణంలో రఫీపై కేసు నమోదు.
నందిగామకు చెందిన 14మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు ముఠాగా ఏర్పడ్డారు. ముసలి వారి, అనారోగ్యంతో ఉన్నవారు.. అమాయకులను ఎంచుకుని వారి పేరు మీద బీమా చేయించే వారు. ఈ అవినీతి వ్యవహారం మూడునెలల క్రితం వెలుగులోకి రావడంతో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మహ్మద్ రఫీపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం స్టేషన్ బెయిల్పై బయటకు వచ్చాడు. ఇదిలా ఉండగా, బీమా చేయించిన వ్యక్తుల నుంచి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో రఫీ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది.