అప్పుల బాధ భరించలేక యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-28T05:49:22+05:30 IST

అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మానకొండూర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన మార్క ప్రశాంత్‌ (26) వ్యవసాయం చేసేవాడు.

అప్పుల బాధ భరించలేక యువకుడి ఆత్మహత్య
ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రశాంత్‌ (ఫైల్‌ఫోటో) ప్రశాంత్‌ రాసిన సూసైడ్‌నోట్‌.

మానకొండూర్‌, మే 27: అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మానకొండూర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన మార్క ప్రశాంత్‌ (26) వ్యవసాయం చేసేవాడు. అతనికి డబ్బు అవసరమై ముద్రకోల రామాంజనేయులు అనే వ్యక్తి వద్ద ఐదు సంవత్సరాల క్రితం రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. దానిపై 10 శాతం వడ్డీ చెల్లిస్తానని నోటు రాసి ఇచ్చాడు. సమయానికి చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి 12 శాతం వడ్డీ చెల్లిస్తానని మరో నోటు రాసి ఇచ్చాడు. తర్వాత సంవత్సరం అది 15 శాతం అయ్యింది. మధ్యలో బంధువుల వద్ద 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి కట్టినా అది వడ్డీలకే సరిపోయింది. ప్రస్తుతం ఆ అప్పు 20 లక్షల రూపాయలకు చేరుకుంది. దీంతో వడ్డీ వ్యాపారి ముద్రకోల రామాంజనేయులు తన అప్పు తీర్చాలని వేధించడం ప్రారంభించాడు. ఆ వేధింపులు భరించలేక గురువారం రాత్రి వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రశాంత్‌ను గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రశాంత్‌ వద్ద సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో ముద్రకోల రామాంజనేయులు వేధింపులతోనే తాను చనిపోతున్నానని, అతడికి ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని రాశాడు. ఇతరుల వద్ద తీసుకు వచ్చిన పది లక్షల రూపాయలు చెల్లించాలని అతడు తన తమ్ముడిని కోరాడు.. ప్రశాంత్‌కు రామడుగు మండలంలోని గుండి గ్రామానికి చెందిన అనన్యతో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. అనన్య ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. ప్రశాంత్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-05-28T05:49:22+05:30 IST