ఠారెత్తించిన ఎండలు

ABN , First Publish Date - 2022-05-22T06:57:21+05:30 IST

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వాసులను శనివారం ఎండలు ఠారెత్తించాయి. ఆకాశం నిర్మలంగా ఉండడం, పడమర గాలులు వీయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

ఠారెత్తించిన ఎండలు

అనకాపల్లి జిల్లాలో 3, విశాఖ రూరల్‌ మండలంలో వడగాడ్పులు

పలుచోట్ల 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు

నేడు, రేపు కూడా వడగాడ్పులు 


విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వాసులను శనివారం ఎండలు ఠారెత్తించాయి. ఆకాశం నిర్మలంగా ఉండడం, పడమర గాలులు వీయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.  ఆరుబయట పనులు చేసేవారు...ముఖ్యంగా ఉపాధి కూలీలు, వ్యవసాయ  కూలీలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట, గొలుగొండ, నాతవరం, విశాఖ జిల్లాలోని రూరల్‌ మండలంలో వడగాడ్పులు వీచాయి. పాయకరావుపేటలో 41.7, నాతవరం, విశాఖ రూరల్‌లో 41.6, గొలుగొండలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం అనకాపలి జిల్లాలోని దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ, మాడుగుల, చోడవరం, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, కశింకోట, మాకవరపాలెం, కోటవురట్ల మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమవారం అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని, కొన్నిచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. 

Updated Date - 2022-05-22T06:57:21+05:30 IST