గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే వేసవి క్రీడా శిబిరాలు
ABN , First Publish Date - 2022-05-12T05:30:00+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకే వేసవి శిక్షణ క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు.
తలమడుగు, మే12: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకే వేసవి శిక్షణ క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. మండలంలోని ఖోడద్ జిల్లా పరిషత్ హైస్కూల్, తలమడుగు జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిబిరాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండేళ్లుగా కరోనా మహమ్మారి వల్ల విద్యార్థులు చదువులకు, క్రీడలకు దూరమయ్యారన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని క్రీడా విద్యార్థులు సద్వినియోగ పర్చుకోవాలన్నారు. తలమడుగు మండలంలో ఎక్కువ మంది క్రీడాకారులు ఉన్నారన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతులను కల్పించేందుకు ప్రణాళికను రూపొందించిందన్నారు. తలమడుగు మండలంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తలమడుగు జడ్పీటీసీ గోకగణేష్రెడ్డి, సర్పంచ్లు ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజా ప్రతినిధులు క్రీడాకారులకు చేయూతనందించాలన్నారు. కాగా తలమడుగు, ఖోడద్ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్లు సాకే ఆనంద్, కరుణాకర్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో జడ్పీటీసీ గోక గణేష్రెడ్డి, జిల్లా క్రీడల అధికారి డీవైఎస్వో వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, ఎంపీడీవో రమాకాంత్, ఎంఈవో నారాయణ, ఎంపీఈవో దిలీప్కుమార్, పీఆర్ఏఈ మజర్, తలమడుగు సర్పంచ్ కరుణాకర్రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ గంగన్న, పురుషోత్తం, తలమడుగు ఎంపీటీసీ చంటి తదితరులు పాల్గొన్నారు.