గ్లోబల్ టాస్క్‌ఫోర్స్ స్టీరింగ్ కమిటీలో.. ముగ్గురు భారతీయ అమెరికన్ సీఈఓలు

ABN , First Publish Date - 2021-05-07T18:46:02+05:30 IST

కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా భారీ సాయం చేస్తోంది. అలాగే అక్కడ ఉన్న భారతీయ అమెరికన్లు సైతం తమకు తోచిన సాయం చేస్తున్నారు.

గ్లోబల్ టాస్క్‌ఫోర్స్ స్టీరింగ్ కమిటీలో.. ముగ్గురు భారతీయ అమెరికన్ సీఈఓలు

వాషింగ్టన్: కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా భారీ సాయం చేస్తోంది. అలాగే అక్కడ ఉన్న భారతీయ అమెరికన్లు సైతం తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. యూఎస్‌లోని ప్రముఖ 40కి పైగా కార్పొరేట్ సంస్థలన్నీ ఒక టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి కరోనా సంక్షోభంలో ఉన్న భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికోసం ఈ గ్లోబల్ టాస్క్‌ఫోర్స్ ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. అమెరికాలోని కార్పొరేట్ సంస్థలు భారత్‌కు అందించే సహాయాన్ని ఈ స్టీరింగ్ కమిటీ పర్యవేక్షించనుంది. గురువారం ఈ స్టీరింగ్ కమిటీలో ముగ్గురు భారతీయ అమెరికన్ సీఈఓలు చేరారు. గుగూల్ సీఈఓ సుందర్ పిచాయ్, డెలాయిట్ సీఈఓ పునిత్ రెంజెన్, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ ఈ కమిటీలో చేరారు.


ఇప్పటికే ఈ కమిటీలో బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్మన్, బిజినెస్ రౌండ్‌టేబుల్ అధ్యక్షుడు, సీఈఓ జాషువా బోల్టెన్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, సీఈఓ సుజాన్ క్లార్క్, యాపిల్ సీఈఓ టీమ్ కుక్, ఫెడెక్స్ ప్రెసిడెంట్ రాజ్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఉన్నారు. ఇక ఈ అమెరికన్ కార్పొరేట్ సెక్టార్ భారత్‌కు సుమారు 25వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో మొదట పంపిన 1,000 కాన్సంట్రేటర్లు ఏప్రిల్ 25న భారత్‌కు చేరుకున్నాయి.                      

Updated Date - 2021-05-07T18:46:02+05:30 IST