కడుపుతీపి మీ ఒక్కరికేనా?: విజయలక్ష్మిపై సుంకర పద్మశ్రీ ఫైర్

ABN , First Publish Date - 2021-04-19T14:40:58+05:30 IST

విజయవాడ: వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మిని చూస్తుంటే గాంధారి గుర్తుకు వస్తున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు, అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు.

కడుపుతీపి మీ ఒక్కరికేనా?: విజయలక్ష్మిపై సుంకర పద్మశ్రీ ఫైర్

విజయవాడ: వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మిని చూస్తుంటే గాంధారి గుర్తుకు వస్తున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు, అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆ గాంధారి తన భర్త చూడని లోకం తాను చూడనని కళ్లకు గంతలు కట్టుకుంటే విజయమ్మ తన పిల్లలు చేస్తున్న అరాచకాలు కళ్లుండి చూడలేని గాంధారిలా మారారని విమర్శించారు. తన కుమార్తె షర్మిల రెండు రోజులు దీక్ష చేస్తే ప్రభుత్వం దిగివచ్చి సమాధానం చెప్పాలని అంటున్నారని.. ఏపీ ప్రజల భవిష్యత్ కోసం అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు మీ పుత్రరత్నం వల్ల దాదాపు 490  రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ఆమెకు పట్టడం లేదన్నారు. ఇంకా సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ... ‘‘అమరావతి మహిళలను పోలీసులతో మీ కొడుకు రక్తం వచ్చేలా కొట్టిస్తే ఎక్కడున్నవమ్మా విజయమ్మ? షర్మిల ఒక్కరేనా మహిళ? అమరావతి మహిళా రైతులు మహిళలు కాదా? కడుపుతీపి మీ ఒక్కరికే ఉంటుందా? వైజాగ్ ఎంపీగా పోటీ చేసిన మీరు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తుంటే నోరు మెదపడం లేదు ఎందుకు? మూడు రాజధానుల పేరుతో అమరావతి, విశాఖను నాశనం చేయడం తప్పు అని ఎప్పుడైనా జగన్‌కి మీరు చెప్పరా? జగన్‌కి ఒక్క అవకాశం ఇవ్వండి అని ఊరు వాడా తిరిగిన మీరు, షర్మిల ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అన్న ఏపీని నాశనం చేస్తుంటే చెల్లి తెలంగాణను నాశనం చేయడానికి సిద్ధమవుతోంది. విజయమ్మ, జగన్, షర్మిల కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును బ్రష్టు పట్టిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-04-19T14:40:58+05:30 IST