మహిళను మూడుసార్లు కాటేసిన పాము...8 మంది మంత్రగాళ్లతో భారీ ఎత్తున పూజలు!

ABN , First Publish Date - 2020-09-12T13:22:01+05:30 IST

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ను మూఢనమ్మకాలు పట్టిపీడిస్తున్నాయి. ఒక పాము 22 ఏళ్ల మహిళను మూడుసార్లు కాటువేసింది. దీంతో కుటుంబ సభ్యులు 8మంది మంత్రగాళ్లను పిలిపించి, రాత్రంతా...

మహిళను మూడుసార్లు కాటేసిన పాము...8 మంది మంత్రగాళ్లతో భారీ ఎత్తున పూజలు!

భరత్‌పూర్: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ను మూఢనమ్మకాలు పట్టిపీడిస్తున్నాయి. ఒక పాము 22 ఏళ్ల  మహిళను మూడుసార్లు కాటువేసింది. దీంతో కుటుంబ సభ్యులు 8మంది మంత్రగాళ్లను పిలిపించి, రాత్రంతా పూజలు చేయించారు. ఈ ఘటన మథురా గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన సప్నా దేవిని ఒక పాము మూడుసార్లు కాటువేసింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ఆర్బీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అక్కడి వైద్య సిబ్బందికి సప్నా దేవి శరీరంపై పాము కాటువేసిన గుర్తులేవీ కనిపించలేదు. 


దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చేశారు. తరువాత పాము కాటుకు మంత్రం వేస్తామని చెప్పుకునే 8 మంది మంత్రగాళ్లను ఇంటికి పిలిపించి, రాత్రంతా పూజలు చేయించారు. ఈ ఉదంతాన్ని కొందరు వీడియో తీశారు. ఈ సందర్భంగా బాధితురాలు సప్నా మాట్లాడుతూ ఒక పాము తనను మూడుసార్లు కాటువేసిందని, తరువాత అది కనిపించకుండా పోయిందని తెలిపారు. అయితే ఆమెను పరిశీలించిన వైద్యులకు ఆమె శరీరంపై పాము కాటు గుర్తు కనిపించలేదు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు మంత్రగాళ్లను ఇంటికి పిలిపించి రాత్రంతా భారీ ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. 


Updated Date - 2020-09-12T13:22:01+05:30 IST