మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు
ABN , First Publish Date - 2021-07-28T04:46:57+05:30 IST
వెనుకబడిన జిల్లాలో మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని వెలుగు, డీఆర్డీఏ అధికారులకు కలెక్టర్ హరిజవహర్లాల్ సూచించారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి) జూలై 27 : వెనుకబడిన జిల్లాలో మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని వెలుగు, డీఆర్డీఏ అధికారులకు కలెక్టర్ హరిజవహర్లాల్ సూచించారు. పదోన్నతితో జిల్లా నుంచి బదిలీపై వెళ్తున్న ఆయన్ని డీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం సోషల్ వెల్ఫేర్, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, డీఆర్డీఏ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తాను ఈ స్థానంలో ఉన్నానంటే.. అందుకు కారణం మాతృమూర్తేనని తెలిపారు. చదువు, పొదుపుపై అవగాహన ఉండడంతో తాను కలెక్టర్ అయ్యాయని చెప్పారు. తొలుత మూడేళ్ల పాటు డీఆర్డీఏ పీడీగా విధులు నిర్వహించినట్లు గుర్తు చేశారు. పేద మహిళలకు ఆసరాగా నిలిచే శాఖ ఇదేనని తెలిపారు. నిరుపేదలు, వారి పిల్లలు ఉన్నతస్థాయికి చేరేలా సిబ్బంది సహకరిం చాలని కోరారు. కలెక్టర్గా జిల్లాకు వచ్చి మూడేళ్లు దాటిందని, ఇక్కడి ప్రజలు, అధికారులు తనను కుటుంబ సభ్యుడిలా అక్కున చేర్చుకున్నారని చెప్పారు. జిల్లాను విడిచి వెళ్లడం బాధగా ఉన్నా.. తప్పదని భావోద్వేగానికి గురయ్యారు. నిజాయితీగా కష్టపడి పనిచేస్తే అవార్డులు తప్పక వరిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీవో విజయలక్ష్మి, డీఆర్డీఏ పీడీ సునీల్రాజ్కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాణి, ఎస్సీ ఈడీ ఎస్.జగన్నాఽథరావు పాల్గొన్నారు.