చిరు వ్యాపారులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2022-01-22T05:02:13+05:30 IST
చిరు వ్యాపారులను ఆదుకోవాలి
- ఆమనగల్లులో బీజేపీ నాయకుల ర్యాలీ
- షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఉపాధి చూపాలని డిమాండ్
ఆమనగల్లు, జనవరి 21: పట్టణంలోని రాజీవ్కూడలిలో శ్రీశైలం -హైదరాబాద్ జాతీయ రహదారిపై జంక్షన్ ఏర్పాటుకు డబ్బాలు, దుకాణాల తొలగింపుతో ఉపాధి కోల్పోయే చిరువ్యాపారులను ఆదుకోవాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దఎత్తున నిరసన చేపట్టారు. చిరు వ్యాపారులతో కలిసి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా బీజేపీజెండాలు చేతపట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. అనంతరం మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. ఎంపీడీవో వెంకట్రాములు, తహసీల్దార్ పాండునాయక్లకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆమనగల్లు రాజీవ్కూడలిలో జాతీయరహదారిపై ఏర్పాటుచేసే జంక్షన్తో షాద్నగర్, మాడ్గుల రోడ్డులో డబ్బాలు, దుకాణాల తొలగింపు చర్యలతో అనేకమంది చిరువ్యాపారుల కుటుంబాలు రోడ్డునపడే ప్రమాదం ఉందన్నారు. మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలల ఎదుట దుకాణ సముదాయాలు నిర్మించి ఉపాధి కోల్పోయే చిరువ్యాపారులకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. కొందరు స్థానికులు కోర్టుకు వెళ్లడంతో దుకాణ సముదాయ నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయిందని, వివాదం పరిష్కారం అయితేనే దుకాణసముదాయ నిర్మాణం చేపట్టడానికి వీలు కలుగుతుందని ఎంపీడీవో వెంకట్రాములు ఆందోళనకారులకు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు చెక్కాల లక్ష్మణ్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుండూరు శేఖర్, బీజేపీ జిల్లా కార్యదర్శి గోరటి నర్సింహా, కౌన్సిలర్లు, నాయకులు తల్లోజు విజయ్కృష్ణ, చెన్నకేశవులు, శ్రీశైలం యాదవ్, శ్రీకాంత్ సింగ్, విష్ణు, శ్రీకాంత్ సింగ్, ఎర్రవోలు శ్రీను, కృష్ణయాదవ్ పాల్గొన్నారు.