కోతులు, కుక్కల బెడదతో బెంబేలు

ABN , First Publish Date - 2022-05-21T06:28:44+05:30 IST

డివిజన్‌ కేంద్రం మార్కాపురంలో కోతులు కుక్కల బెడద అధికంగా ఉంది. అధికారికంగా పట్టణంలో 85 వేల జనాభా 35 వార్డులు ఉన్నాయి.

కోతులు, కుక్కల బెడదతో బెంబేలు
మున్సిపల్‌ కార్యాలయం ఎదురు సమావేశమైన గ్రామసింహాలు

పట్టణంలో భయపెడుతున్న కోతులు

స్వైరవిహారం చేస్తున్న పందులు

హడలెత్తిస్తున్న కుక్కలు

మార్కాపురం(వన్‌టౌన్‌), మే 20 : డివిజన్‌ కేంద్రం మార్కాపురంలో కోతులు కుక్కల బెడద అధికంగా ఉంది. అధికారికంగా పట్టణంలో 85 వేల  జనాభా 35 వార్డులు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో కోతులు, కుక్కలు, పందలు, మూగజీవాలైన ఆవుల సంచారం అధికంగా ఉంది. దీంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పట్టణంలోని 9వ వార్డు ఆర్డీవో కార్యాలయం, గొర్లగడ్డ, చెన్నకేశవస్వామిగుడి వీధి, కోనేరు వీధి తదితర ప్రాంతాలలో కోతుల బెడద ఎక్కువైంది. కోతులు, కుక్కలు పట్టుకొని అడవుల్లో వదిలివేస్తున్నామని మున్సిపల్‌ అధికారు లు చెప్తున్నమాటలు నీటి మూటలయ్యా యి. ప్రతిరోజు కుక్కలు, కోతుల దాడులతో ప్రజలు భయపడుతున్నారు. పందులను దూరంగా తరలిస్తున్నామని చెబుతున్నా, పట్టణ వీధులలో గుంపులుగుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో పాటు ఆవులు, పట్టణ వీధుల లో ఎక్కడబడితే అక్కడ తిరుగుతూ.., ట్రాఫిక్‌కు అవరోధంగా మారుతున్నాయి. చెన్నకేశవస్వామి ఆలయానికి సంబంధించి ఒక్క గోవు కూడా లేకపోయినా ప్రైవేట్‌ వ్యక్తులు వాటిని రోడ్లపైకి వదులుతున్నారు. నోరులేని ఈ జీవాలు రోడ్లపైనే ఉండడంతో వాహనాలు తొక్కి గాయాలపాలవుతున్నాయి. ట్రాఫిక్‌కు అడ్డంగా మారాయి. కోతులు, కుక్కలు గుంపులుగా తిరుగుతు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇళ్లల్లో కోతులు దూరి అదిలించిన వారిపై దాడిచేస్తున్నాయి. కుక్కలు మున్సిపాల్‌ కార్యాలయంలోనే యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. మున్సిపల్‌ అధికారులు ఇప్పటికైనా కోతుల, కుక్కల బెడద తొలగించి పందులను ఊరికి దూరంగా తరలించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-21T06:28:44+05:30 IST