కేసుల విచారణకు గడువును నిర్దేశించాలి : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-11-26T22:08:13+05:30 IST

అందుబాటులో ఉండే సమయం పరిమితం కాబట్టి, కేసుల విచారణకు

కేసుల విచారణకు గడువును నిర్దేశించాలి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : అందుబాటులో ఉండే సమయం పరిమితం కాబట్టి,  కేసుల విచారణకు నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించవలసిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒకే కేసులో చెప్పిన వాదనలనే పునరావృతం చేయడానికి న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించింది. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సదర్భంగా జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సీటీ రవి కుమార్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 


కేసుల విచారణకు నిర్దిష్ట కాల పరిమితి ఉండాలనే ఆలోచన జస్టిస్ ఎంఎన్ వేంకటాచలయ్య భారత ప్రధాన న్యాయమూర్తిగా (1993-94) పని చేసిన కాలం నుంచి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై ఇప్పుడు తీవ్రంగా ఆలోచించాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి మాట్లాడుతూ, చొరవ తీసుకోవాలని కోరింది. చాలా పరిమిత కాలం అందుబాటులో ఉందని, ఒకే వివాదంలో ఓ అంశంపై వినిపించిన వాదనలనే మళ్లీ వినిపించాలని న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఇది ప్రస్తుతం జరుగుతోందని, ఇది ఇప్పటి అనుభవమని వివరించింది. దీంతో తుషార్ మెహతా స్పందిస్తూ, న్యాయమూర్తులు చొరవ తీసుకోగలరని, తాము కేవలం మద్దతు మాత్రమే ఇవ్వగలమని అన్నారు. 


పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (సీఏటీ) ప్రిన్సిపల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ రవి కుమార్ మాట్లాడుతూ, కేసుల విచారణకు నిర్దిష్ట కాల పరిమితి ఉండాలన్నారు. దీనికి కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు. 


Updated Date - 2021-11-26T22:08:13+05:30 IST