వృద్ధులకు ప్రాధాన్యమివ్వండి : ప్రైవేట్ ఆసుపత్రులకు సుప్రీంకోర్టు ఆదేశం
ABN , First Publish Date - 2021-03-04T21:34:40+05:30 IST
చికిత్సను అందజేయడంలో వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలని
న్యూఢిల్లీ : చికిత్సను అందజేయడంలో వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆసుపత్రులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సంస్థలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స కోసం రోగులను చేర్చుకోవడంలో, చికిత్సను అందజేయడంలో వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించింది.
2020 ఆగస్టు 4న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో వృద్ధులకు కరోనా వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల అడ్మిషన్, ట్రీట్మెంట్ విషయంలో వృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ఈ ఆదేశాలను గురువారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సవరించింది.
సీనియర్ అడ్వకేట్ అశ్వని కుమార్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. తన పిటిషన్పై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు సంబంధించిన వివరాలను ఒడిశా, పంజాబ్ మినహా ఇతర రాష్ట్రాలేవీ అందజేయలేదని పిటిషనర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, వృద్ధులకు సహాయపడేందుకు పిటిషనర్ ఇచ్చిన తాజా సలహాలపై స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు మూడు వారాల గడువు ఇచ్చింది.