ధన్‌బాద్ జడ్జి హత్యపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ

ABN , First Publish Date - 2021-07-30T19:35:15+05:30 IST

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ హత్యకు గురైనట్లు

ధన్‌బాద్ జడ్జి హత్యపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ

న్యూఢిల్లీ : జార్ఖండ్‌లోని ధన్‌బాద్ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ హత్యకు గురైనట్లు వచ్చిన ఆరోపణలపై స్వీయ విచారణ జరపాలని సుప్రీంకోర్టు శుక్రవారం నిర్ణయించింది. ఈ సంఘటనపై సవివరమైన నివేదికలను సమర్పించాలని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి నోటీసులు ఇచ్చింది.  దేశంలో న్యాయాధికారుల రక్షణ, భద్రత సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. 


జడ్జి ఉత్తమ్ ఆనంద్ ధన్‌బాద్‌లోని తన నివాసం నుంచి బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్ళారు. ఆ సమయంలో గుర్తు తెలియని ఆటో ఆయనను ఢీకొట్టడంతో రక్తపు మడుగులో పడిపోయారు. ఆ తర్వాత ఆయనను ఓ వ్యక్తి ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆటో డ్రైవర్‌తోపాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై జార్ఖండ్ హైకోర్టు కూడా స్వీయ విచారణ జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఈ కేసుకు సంబంధించిన వివరాలను అందజేయాలని ఆదేశించింది. ఉత్తమ్ ఆనంద్ వాకింగ్ చేస్తుండగా ఓ ఆటో ఢీకొట్టినట్లు కనిపిస్తున్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ధన్‌బాద్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. 


ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును స్వీయ విచారణకు చేపట్టింది. న్యాయాధికారులపైనా, న్యాయవాదులపైనా దాడులు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. దేశంలో న్యాయాధికారుల రక్షణ, భద్రతకు భరోసా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. జడ్జిలకు రక్షణ కల్పించాలని ఆదేశిస్తూ, అన్ని రాష్ట్రాలకు నోటీసులిచ్చింది. 


ధన్‌బాద్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను దారుణంగా హత్య చేసినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తును జార్ఖండ్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని పేర్కొంది. ఈ సంఘటనపై ఓ వారంలోగా సవివరమైన నివేదికలను సమర్పించాలని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)ను ఆదేశించింది. 


Updated Date - 2021-07-30T19:35:15+05:30 IST