Bilkis Bano Case: దోషుల విడుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2022-08-25T18:12:35+05:30 IST

గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం కేసులో

Bilkis Bano Case: దోషుల విడుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ : గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. సీపీఎం నేత సుభాషిణి అలీ, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర, మరొకరు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ రెండు వారాల తర్వాత జరుగుతుందని తెలిపింది. 


గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగినట్లు రుజువైంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీరిని విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం స్పందిస్తూ, దోషులను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకోవడంలో వివేకాన్ని ఉపయోగించారా? లేదా? అనే విషయాన్ని తాము పరిశీలిస్తామని చెప్పింది. వారిని విడుదల చేయాలని ఈ న్యాయస్థానం ఆదేశించలేదని, విధానం ప్రకారం శిక్ష తగ్గింపు గురించి పరిశీలించాలని మాత్రమే చెప్పిందని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినవారికే శిక్ష తగ్గింపు లభిస్తుందని తెలిపింది. 


ఈ కేసులో 11 మంది దోషులు 15 సంవత్సరాలపాటు శిక్షను అనుభవించారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా వీరిని గుజరాత్ ప్రభుత్వం రిమీషన్ పాలసీ ప్రకారం విడుదల చేసింది. వీరు విడుదలైన తర్వాత వీరికి లభించిన స్వాగత సత్కారాలు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. 


Updated Date - 2022-08-25T18:12:35+05:30 IST