NEET ప్రవేశాల్లో ఓబీసీ కోటా సమర్థనీయమే : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-01-20T23:37:15+05:30 IST

భారీ స్కోరు మాత్రమే ప్రతిభకు ఏకైక కొలమానం కాదని సుప్రీంకోర్టు

NEET ప్రవేశాల్లో ఓబీసీ కోటా సమర్థనీయమే : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : భారీ స్కోరు మాత్రమే ప్రతిభకు ఏకైక కొలమానం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. 2021-22 విద్యా సంవత్సరంలో NEET అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశాల్లో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ)లకు రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పును గురువారం సమర్థించింది. సాంఘిక, ఆర్థిక నేపథ్యంతో ప్రతిభను కలగలిపి చూడాలని తెలిపింది. వెనుకబాటుతనాన్ని సరిదిద్దడంలో రిజర్వేషన్ల పాత్రను నిస్సారం చేయకూడదని పేర్కొంది. ప్రతిభ, రిజర్వేషన్లు పరస్పర సంఘర్షణ కలవి కాదని తెలిపింది. సాంఘిక న్యాయం తాలూకు సమ పంపక పర్యవసానాలను రిజర్వేషన్లు మరింత ముందుకు తీసుకెళ్తాయని పేర్కొంది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. 


ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు చెందినవారికి NEET-PG ప్రవేశాల విధానంపై నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చేది లేదని తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం (రూ.8 లక్షలు స్థూల వార్షికాదాయం) ప్రస్తుత విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని తెలిపింది. ఈ దశలో ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఈ సంవత్సరం ప్రవేశాలు ఆలస్యమవుతాయని పేర్కొంది. 2021-22 బ్యాచ్‌కి రిజర్వేషన్ల విధానంపై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వబోమని తెలిపింది. మనం ఇంకా కోవిడ్-19 మహమ్మారి మధ్యనే ఉన్నామని పేర్కొంది. వైద్యుల నియామకంలో ఆలస్యమైతే, దాని ప్రభావం మహమ్మారిపై స్పందనపై పడుతుందని తెలిపింది. 


అర్థవంతమైన సమానత్వం ఉండాలని రాజ్యాంగంలోని అధికరణలు 15(4), 15(5) చెప్తున్నట్లు తెలిపింది. వ్యక్తుల సమర్థత, సామర్థ్యాలు, ప్రతిభను పోటీ పరీక్షలు ప్రతిబింబించబోవని పేర్కొంది. కొన్ని వర్గాలకు లభించే సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక సానుకూలతలను పోటీ పరీక్షలు ప్రతిబింబించబోవని తెలిపింది. 


సుప్రీంకోర్టు జనవరి 7న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో, 2021-22 విద్యా సంవత్సరానికి NEET-PG admissionsకు మెడికల్ కౌన్సెలింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటాను సమర్థించింది. 



Updated Date - 2022-01-20T23:37:15+05:30 IST