పన్నెండో తరగతి మార్కుల విధానాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
ABN , First Publish Date - 2021-06-22T22:24:03+05:30 IST
పన్నెండో తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించేందుకు సీబీఎస్ఈ
న్యూఢిల్లీ : పన్నెండో తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించేందుకు సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ ప్రతిపాదించిన విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ పరీక్షలను ఈ సంవత్సరం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
విద్యార్థులు భౌతికంగా హాజరై పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని తల్లిదండ్రుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ ప్రతిపాదించిన విధానం సమంజసంగా, న్యాయంగా ఉందని తెలిపింది. ఈ విధానంలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. విద్యా రంగంలోని నిపుణులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలు చేశారని తెలిపింది. ఎవరికీ ప్రతికూలత లేకుండా పరిపూర్ణ స్థాయిలో ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు పేర్కొంది. దీనిపై రెండో ఆలోచనకు తావు లేదని స్పష్టం చేసింది. విశాల ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిపింది. పన్నెండో తరగతి కంపార్ట్మెంట్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. కంపార్ట్మెంట్ పరీక్షలను ఆగస్టు 15-సెప్టెంబరు 15 మధ్యలో నిర్వహించేందుకు సీబీఎస్ఈ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది.
జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి వెకేషన్ బెంచ్ మంగళవారం ఈ తీర్పునిచ్చింది.