భార్యాభర్తల గొడవ.. పోలీసుల ఎంట్రీ .. వారు చేసిన పనికి చుట్టుపక్కల వారందరూ షాక్!

ABN , First Publish Date - 2021-08-26T23:18:10+05:30 IST

భార్యాభర్తల గొడవ సీన్‌లోకి పోలీసుల ఎంట్రీ..ఆ తరువాత ఆశ్చర్యంకలిగించే పరిణామాలు

భార్యాభర్తల గొడవ.. పోలీసుల ఎంట్రీ .. వారు చేసిన పనికి చుట్టుపక్కల వారందరూ షాక్!

ఇంటర్నెట్ డెస్క్: వారిది దాదాపు 30 ఏళ్ల కాపురం..! అయినా.. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే! కానీ ఆ రోజు మాత్రం వారు టాపు లేచిపోయేటట్టు తీవ్రంగా గొడవపడుతున్నారు. భార్యపై భర్త రెండు దెబ్బలు వేశాడు కూడా! ఇదంతా చూస్తూ కూడా వారిని ఎలా ఆపాలో తెలియక ఇరుగుపొరుగు వారు బేజారైపోతున్నారు. వాళ్లేమో పెద్దవారాయే.. ఏమీ అనటానికి లేదు. కానీ..గొడవమాత్రం ఎంతకీ సద్దుమణగట్లేదు. ఆ భార్యాభర్తలు ఎవ్వరిమాట వినేటట్టు కనిపించట్లేదు. ఏం చేయాలో పాలుపోని స్థితి. పరిస్థితి చేయి దాటుతుందేమోననే చిన్న భయం..పెద్దాయన కోపంలో కంట్రోల్ తప్పితే..ఏమైనా జరగవచ్చు.  ఇటువంటి టైంలో అకస్మాత్తుగా పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇరుగుపొరుగు వారికి పోయిన ఊపిరి తిరిగొచ్చినంతపనైంది. 


ఎవరో ఫోన్ చేసి ఉంటారు.. వారి గొడవ ఆపడానికే పోలీసులు వచ్చి ఉంటారు..అనుకుంటూ అక్కడున్న వారందరూ నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో షాకింగ్ సీన్.. పోలీసులు భర్తను అరెస్టు చేసి..తీసుకెళ్లిపోయారు. ఇంత పెద్దాయనను చిన్న గొడవకే అరెస్టు చేస్తున్నారేమిటా అని అనుకుంటూ ఆశ్చర్యపోవడం ఇరుగుపొరుగు వారి వంతైంది. చత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఉదంతం ఇది. 


వాస్తవానికి పోలీసులు వచ్చింది భార్యాభర్తల తగవు తీర్చడానికి కాదని అక్కడున్న వారికి ఆ తరువాత గానీ తెలియలేదు. పోలీసులు అరెస్టు చేసిన ఆ పెద్దాయన పేరు ఉమేష్ సింగ్(65).. ఆయన గతంలో గని కార్మికుడిగా పని చేసి రిటైరయ్యారు. అయితే..ఉమేష్ చట్టవ్యతిరేకంగా తన ఇంట్లో నాటు తుపాకీ దాచిపెట్టాడని పోలీసులకు సమాచారం అందటంతో వారు ఆ రోజు తనిఖీ చేసేందుకు వారి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో వారు ఊహించినట్టే నాటు తుపాకీ ఒకటి దొరికింది. దీంతో ఉమేష్‌పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-08-26T23:18:10+05:30 IST