సూరత్‌లో తొలి బుల్లెట్ రైలు స్టేషన్.. ఫొటోలు షేర్ చేసిన కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2022-02-11T01:19:02+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బుల్లెట్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుల్లెట్

సూరత్‌లో తొలి బుల్లెట్ రైలు స్టేషన్.. ఫొటోలు షేర్ చేసిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బుల్లెట్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న ఈ మార్గం దేశంలోనే మొదటిది. తాజాగా, ఇందుకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చేసింది.


బుల్లెట్ రైలు మార్గం నిర్మాణంతో సమానంగా పనులు జరుగుతున్న దేశంలోనే తొలి బుల్లెట్ రైలు స్టేషన్‌కు సంబంధించిన గ్రాఫికల్ ఫొటోలను రైల్వేశాఖ సహాయమంత్రి దర్శన జర్దోష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. డిసెంబరు 2024 నాటికి  ఇది పూర్తవుతుందని పేర్కొన్నారు.  


 అత్యాధునిక సౌకర్యాలతో ఈ స్టేషన్ రూపుదిద్దుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. బహుళ అంతస్తుల ఈ స్టేషన్ లోపలి భాగం సూరత్ నగరానికి గర్వకారణంగా నిలిచేలా మెరిసే వజ్రాన్ని పోలి ఉంటుందని మంత్రి తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు బాధ్యతలను జాతీయ హైస్పీడ్ రైల్  కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌సీఆర్‌సీఎల్) చూసుకుంటోంది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు మొత్తం 508.17 కిలోమీటర్లు కాగా, మహారాష్ట్రలో 155.76  కిలోమీటర్లు, గుజరాత్‌లో 384,04 కిలోమీటర్లు, దాద్రానగర్ అండర్ హవేలిలో 4.3 కిలోమీటర్ల మేర ఉంది.


సూరత్‌తోపాటు వాపి, బిలిమోరా, భరూచ్ స్టేషన్లు కూడా డిసెంబరు 2024 నాటికి పూర్తి కానున్నట్టు బుల్లెట్ రైలు ప్రాజెక్టు అధికారి ఒకరు తెలిపారు. అలాగే, ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, థానే, విరార్, బోయిసోర్, వడోదర, అహ్మదాబాద్, సబర్మతిలలో కూడా బుల్లెట్ రైలు స్టేషన్లు నిర్మితమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. ఇందులో 88 వేల కోట్ల రూపాయల నిధులను జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) సమకూరుస్తోంది.

Updated Date - 2022-02-11T01:19:02+05:30 IST