కడుపునొప్పితో బాధపడ్డా..
ABN , First Publish Date - 2022-09-27T09:33:57+05:30 IST
ఆసీస్ తో చివరి టీ20కి ముందురోజు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కడుపునొప్పితో బాధపడ్డాడు.
హైదరాబాద్: ఆసీస్ తో చివరి టీ20కి ముందురోజు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కడుపునొప్పితో బాధపడ్డాడు. కానీ హైదరాబాద్ మ్యాచ్ జట్టుకు నిర్ణాయక పోరు. దాంతో జట్టు డాక్టర్, ఫిజియోతో సూర్యకుమార్ ఏమన్నాడంటే ‘ఇది ప్రపంచ కప్ ఫైనల్ అయ్యుంటే నేను ఎలా ఫీలయ్యేవాడినో మీరు ఊహించండి. అందువల్ల నాకు ఏ ట్యాబ్లెటైనా ఇవ్వండి, ఇంజెక్షన్ ఇచ్చినా పర్లేదు. కానీ నా కడుపునొప్పి తగ్గాలి. ఆదివారంనాడు మ్యాచ్ ఆడాలి’ అని అన్నాడు. ఈ విషయాన్ని సూర్య తనకు చెప్పినట్టు అక్షర్ పటేల్ వెల్లడించాడు. ఈ మ్యాచ్లో చెలరేగిన సూర్యకుమార్ (36 బంతుల్లో 69) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఫిలాండర్ను ఆడుకున్నారు..:
సూర్యకుమార్ను ‘పిల్లోడి’గా అభివర్ణించిన సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఫిలాండర్ను నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో 32 ఏళ్ల సూర్యకుమార్ బ్యాటింగ్ను ప్రశంసిస్తూ ‘ఈ పిల్లోడు ఆడడం చూస్తే అద్భుతంగా ఉంటుంది’ అని ట్వీట్ చేశాడు. అంతే.. ఫిలాండర్ను నెటిజన్లు వివిధ రకాలుగా ఎద్దేవా చేస్తూ అతడిపై విరుచుకుపడ్డాడు.
జడేజా స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు అక్షర్పై ఆసీస్ కోచ్ ప్రశంస
గాయంతో జడేజా వైదొలగడంతో భారత బౌలింగ్ బలహీనపడుతుందని అంతా భావించారని ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ అన్నాడు. కానీ మరో లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్...జడేజా స్థానాన్ని భర్తీ చేస్తున్నాడని పేర్కొన్నాడు. ‘ఈ సిరీ్సలో అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జడేజా దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ ఒకింత బలహీనపడుతుందని అంచనా వేశారు. కానీ అక్షర్ రూపంలో వారికి చక్కటి బౌలర్ లభించాడు’ అని మెక్డొనాల్డ్ మెచ్చుకున్నాడు.