Sad Incident: ఏం ప్రేమలో.. ఏం పెళ్లిళ్లో.. ఏదేమైనా ఇలా జరగడం మాత్రం..

ABN , First Publish Date - 2022-04-28T22:26:18+05:30 IST

కర్ణాటకలోని కొడగు జిల్లాలో విషాద ఘటన జరిగింది. కొడగు జిల్లా పొన్నంపేట్ తాలూకాలోని బేలూరు గ్రామంలో పెళ్లయిన ఏడాదిన్నరకే..

Sad Incident: ఏం ప్రేమలో.. ఏం పెళ్లిళ్లో.. ఏదేమైనా ఇలా జరగడం మాత్రం..

కొడగు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో విషాద ఘటన జరిగింది. కొడగు జిల్లా పొన్నంపేట్ తాలూకాలోని బేలూరు గ్రామంలో పెళ్లయిన ఏడాదిన్నరకే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేలూరు గ్రామానికి చెందిన అనుపమ అనే 20 ఏళ్ల యువతి, నితీష్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దలను కాదనుకుని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నితీష్ తల్లిదండ్రులు జరిగిందేదో జరిగిందని కొడుకు, కోడలిని పెళ్లయిన నెలన్నరకు ఇంటికి రమ్మన్నారు. అనుపమ, నితీష్ ఎంతో సంతోషంగా ఇంటికెళ్లారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో కోడలిని కాపురానికొచ్చిన కొన్ని రోజులకే నితీష్ కుటుంబం పనులకు పంపించింది. కోడలిని సరిగ్గా చూసుకోకుండా అవమానాలకు గురిచేసి ఇబ్బంది పెట్టేవారు.



ఈ క్రమంలోనే.. ఏం జరిగిందో తెలియదు గానీ ఏప్రిల్ 27న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అనుపమ డిప్రెషన్‌కు లోనై బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకు లోనైంది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మార్గ మధ్యంలో ప్రాణాలు విడిచింది. అనుపమ మృతిపై ఆమె భర్త నితీష్ స్పందిస్తూ.. ఆమెను చూసే సమయానికి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించిందని చెప్పుకొచ్చాడు. అనుపమ మృతికి కారణం ఆమె అత్తింటి వారేనని, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారనే కోపంతో తమ కూతురిని ఎన్నో  కష్టాలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురి మృతి వెనుక ఉన్న నిజానిజాలను నిగ్గు తేల్చాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని అనుపమ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పొన్నంపేట్ పోలీసులు అనుపమ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-28T22:26:18+05:30 IST