Nupur Sharmaపై suspension సరిపోదు, Jail కు పంపండి: Mayawati
ABN , First Publish Date - 2022-06-06T22:58:09+05:30 IST
దేశంలో అన్ని మతాలకు గౌరవం అవసరం. ఏ మతంపై అయినా అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించడం సరికాదు. ఈ విషయంలో బీజేపీ తన ప్రజలపై ఉక్కుపాదం మోపాలి. మత విధ్వేషాలు రెచ్చగొట్టే వారిని సస్పెండ్ చేయడం, బహిష్కరించడం..
లఖ్నవూ: నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్లపై వేటు వేయడంతోనే సరిపెట్టకుండా కఠిన చట్టాల ప్రకారం వారిని జైలుకు పంపించాలంటూ బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి అన్నారు. అలాగే కాన్పూర్ అల్లర్లను అదుపు చేసే ప్రయత్నాల్లో అమాయక ప్రజలను వేధింపులకు గురి చేయొద్దని ఆమె డిమాండ్ చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన ఈ ఇద్దరు నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ఆదివారం ప్రకటించింది. బీజేపీ అధికార ప్రతినిధి అయిన నుపుర్.. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త(Prophet Muhammad)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం అధ్యక్షుడు నవీన్కుమార్ జిందాల్ను కూడా సోషల్ మీడియాలో మత సామరస్యానికి విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టాడని స్వయంగా బీజేపీనే పేర్కొంది.
కాగా, ఈ విషయమై సోమవారం సోషల్ మీడియా ద్వారా మాయావతి స్పందిస్తూ ‘‘దేశంలో అన్ని మతాలకు గౌరవం అవసరం. ఏ మతంపై అయినా అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించడం సరికాదు. ఈ విషయంలో బీజేపీ తన ప్రజలపై ఉక్కుపాదం మోపాలి. మత విధ్వేషాలు రెచ్చగొట్టే వారిని సస్పెండ్ చేయడం, బహిష్కరించడం మాత్రమే చేస్తే సరిపోదు. కఠిన చట్టాల ప్రకారం వారిని జైలుకు పంపాలి. ఇది మాత్రమే కాదు, ఇటీవల కాన్పూర్లో జరిగిన హింసాకాండ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో, ఈ హింసకు వ్యతిరేకంగా పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో అమాయక ప్రజలను వేధించకూడదు. ఇది బీఎస్పీ డిమాండ్’’ అని ట్వీట్ చేశారు.