సూయజ్ కాల్వ విశేషాలివి!
ABN , First Publish Date - 2021-04-01T05:30:00+05:30 IST
సూయజ్ కాల్వ ఈజిప్ట్లో ఉంది. అతిపెద్ద సరకు రవాణా కేంద్రంగా పేరొందిన ఈ కాల్వ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ లేదు.
ఈమధ్య ఒక పెద్ద నౌక సూయజ్ కాల్వలో నిలిచిపోయిందనే వార్తలు పత్రికల్లో, టీవీల్లో చూశాం. ఎట్టకేలకు ఆ భారీ సరకు రవాణా నౌకను పెద్ద పెద్ద పడవల సాయంతో మళ్లీ నీటిపై తేలేలా చేశారు. ఇంతకీ సూయజ్ కెనాల్ ఎక్కడ ఉంది. దీని విశేషాలు ఏంటో చదివేద్దాం...
సూయజ్ కాల్వ ఈజిప్ట్లో ఉంది. అతిపెద్ద సరకు రవాణా కేంద్రంగా పేరొందిన ఈ కాల్వ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ లేదు. ప్రపంచవ్యాప్తంగా సరకు రవాణా సౌలభ్యం కోసం మనుషులే 193 కిలోమీటర్ల పొడవున్న ఈ కాల్వను నిర్మించారు.
ఫ్రెంచ్ ఇంజనీర్ లినంట్ డి బెల్లేఫోండ్స్ నిర్వహించిన సర్వే ఆధారంగా 1830లో సూయజ్ కాల్వ నిర్మించాలనే విషయమై చర్చలు జరిగాయి. యూనివర్సల్ సూయజ్ షిప్ కెనాల్ కంపెనీ 1859లో ఈ కాల్వ నిర్మాణాన్ని చేపట్టి పదేళ్లలో ముగించింది. మధ్యధరా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని సూయజ్ కెనాల్ కలుపుతుంది.
1956 ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఉన్న గమాల్ అబ్దుల్ నాజర్ సూయజ్ కాల్వను జాతికి అంకితం చేశారు. 1967లో ఈజిప్ట్, ఇజ్రాయేల్ మధ్య ఆరు రోజులు యుద్ధం జరగడంతో సూయజ్ కాల్వను మూసివేశారు. శాంతి ఒప్పందంలో భాగంగా 1975 తిరిగి సరకు రవాణాకు అనుమతిచ్చారు.
ప్రతి రోజూ సూయజ్ కాల్వ గుండా దాదాపు 50 నౌకలు ప్రయాణిస్తాయి. ఈ కాల్వను దాటడానికి ఒక్కో నౌకకు 13 నుంచి 15 గంటలు పడుతుంది.