సంకిరేణిపల్లెలో స్వామి వివాదం

ABN , First Publish Date - 2021-12-05T04:27:03+05:30 IST

మండల పరిధిలోని సంకిరేణిపల్లె గ్రామంలో శనివారం స్వామి వివాదం నెలకొంది. పోలీస్‌లు సంఘటనా స్థలానికి చెరుకొని సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

సంకిరేణిపల్లెలో స్వామి వివాదం
సంకిరేణిపల్లెలో అదిక సంఖ్యలో వచ్చిన జనం

  1.  భారీగా తరలి వచ్చిన జనం 
  2.  గ్రామస్థుల అభ్యంతరం
  3.  పోలీసులు వచ్చి వెనక్కి పంపిన వైనం


పగిడ్యాల, డిసెంబరు 4: మండల పరిధిలోని సంకిరేణిపల్లె గ్రామంలో శనివారం స్వామి వివాదం నెలకొంది. పోలీస్‌లు సంఘటనా స్థలానికి చెరుకొని సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. గ్రామానికి చెందిన హరికుమార్‌కు అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఒంట్లోకి వచ్చి మంచి చెడుల గురించి చెబుతాడని జనాల నమ్మకం. దీంతో ప్రతి శనివారం వివిధ సమస్యలతో వందల మంది గ్రామానికి చేరుకుంటున్నారు. భారీగా జనాలు తరలి వస్తుండడంతో కాలనీలు కిక్కిరిసిపోతున్నాయి. దీనికి తోడు ఇతర గ్రామాలకు చెందిన మధ్యవర్తులు ఇక్కడికి వచ్చి దేవాలయ నిర్మాణం పేరుతో చందాలు వసూలు చేస్తున్నారు. ఈ విషయమై కొద్ది రోజుల కిందట పోలీసులు, రెవెన్యూ అధికారులకు కొంతమంది గ్రామ స్థులు ఫిర్యాదు చేశారు. దీంతో కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా మరో చోట కార్యకలాపాలు నిర్వహించుకోవాలని అధికారులు హరికుమార్‌కు సూచించారు. అయితే హరికుమార్‌ యథావిధిగా తన కార్యక్రమాలు అదే గ్రామంలో నిర్వహిస్తున్నాడు. శనివారం అధిక సంఖ్యలో జనాలు తరలి రావడంతో ఆగ్రహించిన కాలనీవాసులు వెనక్కు తిప్పి పంపడంతో హరికుమార్‌ తరపు వారు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాగార్జున గ్రామానికి చేరుకున్నారు. ఐదు నెలలుగా ప్రతి శనివారం అధిక సంఖ్యలో జనాలు వస్తున్నారని, కరోనాతో ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఎస్‌ఐతో వాపోయారు. దీంతో హరికుమార్‌తో ఎస్‌ఐ మాట్లాడి కాలనీవాసులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జనాన్ని వెనక్కు పంపించేసి గ్రామంలో సిబ్బందిని ఏర్పాటు చేశారు.


Updated Date - 2021-12-05T04:27:03+05:30 IST