భక్తజన సంద్రం.. యాదాద్రి క్షేత్రం

ABN , First Publish Date - 2022-05-23T09:36:03+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఆదివారం భక్తజనసంద్రాన్ని తలపించింది.

భక్తజన సంద్రం.. యాదాద్రి క్షేత్రం

క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షణ

స్వామివారి ఆదాయం రూ. 33 లక్షలు

యాదగిరిగుట్ట, మే 22: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఆదివారం భక్తజనసంద్రాన్ని తలపించింది. ప్రధానాలయ పరిసరాలు, ఆర్జిత సేవా మండపాలు, తిరువీధుల్లో రద్దీ ఏర్పడింది. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించారు. ధర్మదర్శనాలకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. రూ.150లు చెల్లించి వీవీఐపీ టిక్కెట్టు కొనుగోలు చేసిన భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు. గతంలో ఈ టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక క్యూలైన్‌ ఉండేది. అయితే ఇప్పుడు వీరిని కూడా ధర్మదర్శనాలకు వెళ్లే భక్తుల క్యూకాంప్లెక్స్‌లోనే పంపించడంతో అసంతృప్తి వ్యక్తమయింది.


వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పిన అధికారులు వాటిని మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ఉద్ఘాటన తరువాత తగిన విధంగా క్యూలైన్ల వ్యవస్థను ఇంకా ఏర్పాటు చేయలేదని పలువురు అసహనం వ్యక్తంచేశారు. అష్టభుజి ప్రాకార మండపంలో హోమపూజలు, నిత్య కల్యాణోత్సవం, కొండకింద పాతగోశాలలోని మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల సందడి నెలకొంది. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.15.40లక్షలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వివిధ విభాగాల ద్వారా మొత్తం రూ.33,81,486 సమకూరినట్టు చెప్పారు.


ఎల్లుండి హనుమజయంతి

యాదగిరిగుట్ట క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి జయంతి వేడుకలు బుధవారం జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు సంప్రదాయరీతిలో పూజలు జరుగుతాయని దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-05-23T09:36:03+05:30 IST