పగలు టీడీపీతో.. రాత్రి వైసీపీతో తిరిగే వారు మారండి
ABN , First Publish Date - 2022-02-13T06:44:50+05:30 IST
పగలు టీడీపీతో.. రాత్రి వైసీపీ వారితో తిరిగే వారు మారాలని టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పులివర్తి నాని సూచించారు.
కార్యకర్తల సమావేశంలో పులివర్తినాని
రామచంద్రాపురం, ఫిబ్రవరి 12: పగలు టీడీపీతో.. రాత్రి వైసీపీ వారితో తిరిగే వారు మారాలని టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పులివర్తి నాని సూచించారు. రామచంద్రాపురం మండలం మిట్టూరు కమ్యూనిటీ భవనంలో శనివారం మండల పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులు ఎన్నికల ముందువరకు కొట్టుకున్నా, ఎన్నికలప్పుడు ఒక్కటై పోరాటం చేస్తారన్నారు. అదే టీడీపీలో ఎన్నికల ముందు వరకు కలిసుండి.. ఆపై లేనిపోని విబేధాలతో విడిపోతారన్నారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా అందరి సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తామన్నారు. చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనతో అన్ని వర్గాలు విసిగిపోయాయన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక రెండున్నరేళ్లుగా వైసీపీ నాయకులు తిరుగుతున్నారని , అటువంటి వారి చుట్టూ తిరిగి ప్రయోజనం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులకు 12శాతం వడ్డీతో బిల్లులు మంజూరు చేస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అంతకుముందు ఆర్సీపురం మండల సరిహద్దుల్లో నుంచి వందలాది మంది కార్యకర్తలు చేపట్టిన స్కూటర్ర్యాలీని నాని జెండా ఊపి ప్రారంభించారు. అన్నా మీవెంట మేమున్నాం, ప్రాణాలైనా అర్పించి గెలిపిస్తామంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చినబాబు, జిల్లా నాయకులు ఉమాపతినాయుడు, జనార్దన్చౌదరి, ఢిల్లీనాథరెడ్డి, హరిప్రసాద్, ధనంజయరెడ్డి, సుబ్రహ్మణ్యంయాదవ్, మండల నాయకులు గిరినాయుడు, విజయ్కుమార్, మునెయ్య, వెంకటప్రసాద్, గిరిధర్రెడ్డి, దాదాసాహేబ్, గుణసుందరి, జయచంద్రనాయుడు, గోపి, రవి, చిరంజీవి, మురళీనాయుడు, ప్రభాకర్, గరుడాద్రినాయుడు, టీఎన్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొత్తూరి రెడ్డెప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు.