సింధు అదరగొట్టింది
ABN , First Publish Date - 2022-01-24T08:10:28+05:30 IST
స్టార్ షట్లర్ పీవీ సింధు సుదీర్ఘ టైటిల్ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది.
‘సయ్యద్ మోదీ’ విజేత తెలుగు షట్లర్
వరల్డ్ చాంపియన్షి్ప తర్వాత తొలి టైటిల్
లఖ్నవూ: స్టార్ షట్లర్ పీవీ సింధు సుదీర్ఘ టైటిల్ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో టాప్సీడ్ సింధు 21-13, 21-16తో యువ క్రీడాకారిణి మాళవికా బన్సోడ్పై విజయం సాధించింది. ఈ టైటిల్ను గెలవడం సింధుకిది రెండోసారి. 2017లో మొదటిసారి విజేతగా నిలిచింది. 2019 ఆగస్టులో వరల్డ్ చాంపియన్షిప్ గెల్చిన తర్వా త సింధు మళ్లీ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. కాగా..ఏడో సీడ్, భారత ద్వయం తనీషా/ఇషాన్ మిక్స్డ్ టైటిల్ అందుకుంది. ఫైనల్లో ఇషా జంట 21-16, 21-12తో సహచర జోడీ హేమనాగేంద్ర బాబు/శ్రీవిద్య గురజాడపై గెలిచింది. మహిళల డబుల్స్లో గాయత్రీ గోపీచంద్/ట్రీసా జోలీ, పురుషుల డబుల్స్లో కృష్ణప్రసాద్/విష్ణువర్ధన్ జోడీలు ఫైనల్లో ఓటమి చవిచూశాయి. అర్నవ్ మెర్కెల్-లుకాస్ మధ్య జరగాల్సిన పురుషుల సింగిల్స్ ఫైనల్ను రద్దు చేశారు. ఫైనలిస్టుల్లో ఒకరు కరోనా బారినపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.