రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
గుంటూరు, తాడేపల్లి టౌన్, జూన్22: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. యువతిపై అత్యాచార ఘటనకు ఖరీదుకట్టి ప్రభుత్వం చేతులు దులుపుకొంటుందా? అని ప్రశ్నించారు. తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో యువతిపై అత్యాచార ఘటన జరిగిన ప్రాంతాన్ని పార్టీ మహిళా ప్రతినిధులు, నేతలతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అనిత విలేకరులతో మాట్లాడుతూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సీఎం నివాస సమీపంలోనే ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్రంలో ఆడవాళ్లకు భద్రత కరువయిందా అనిపిస్తుందన్నారు. రాష్ట్ర హోం మంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్, మహిళా ఎమ్మెల్యేలు సీఎం జగన్కు భజన చేయడం మానుకుని మహిళల భద్రతపై దృష్టిపెట్టాలని ఎద్దేవా చేశారు. ఈ ఘటన జరిగిన చోట కనీసం విద్యుత్ లైట్లు కూడా వెలగడం లేదని, స్థానికులు చెప్పారన్నారు. చంద్రబాబు హయాంలో పుష్కరాల సందర్భంగా ఘాట్లను ఆధునికీకరణ చేయడంతోపాటు భారీ లైట్లు కూడా ఏర్పాటు చేస్తే అవి వెలిగించడానికి మునిసిపాలిటీ దగ్గర విద్యుత్ బిల్లులు కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి దాపురించిందన్నారు. అమరావతి రైతులను అక్రమ అరెస్టు చేయడానికి రైతు నాయకుల ఇళ్ల వద్ద ఇద్దరు ముగ్గురు పోలీసులను పెట్టి, బెదిరింపులకు పాల్పడే బదులు ఇలాంటి చోట్ల పోలీసు పహరా ఏర్పాటు చేయడంపై శ్రద్ధ పెట్టాలని అనిత అన్నారు.
పరామర్శకూ అనుమతి లేదంటారా..?
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలను పరామర్శించటానికి అనుమతి లేదంటూ అడ్డుకోవటం దారుణమని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. తాడేపల్లి అత్యాచార బాధితురాలను పరామర్శించటానికి మహిళా నేతలతో కలిసి మంగళవారం ఆమె జీజీహెచ్కు చేరుకున్నారు. అయితే అక్కడి సిబ్బంది అనుమతి లేదంటూ నేతలను నిలిపివేశారు. క తర్వాత ఇద్దరు నేతలకు అనుమతి ఇచ్చారు. అనంతరం అనిత మీడియాతో మహిళలకు ఉచిత పథకాలకంటే రక్షణ, చేయూత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం మూలగానే మహిళలపై దాడులు జరగుతున్నాయని గద్దె అనురాధ అన్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో నేతలు నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్కుమార్, అన్నాబత్తిని జయలక్ష్మి, షేక్ రిజ్వానా, పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాసరావు, నాయుడు ఓంకార్, ధనేకులు సభ్బారావు, తలతోటి సురేంద్ర, గంజి చిరంజీవి, జంగాల సాంబశివరావు, చావలి ఉల్లయ్య, ఆరుద్ర భూలక్ష్మి, కొసరాజు శైలజ, బొర్రా కృష్ణవందన, పద్మ, దొప్పలపూడి జ్యోతిబసు, ఇట్టా పెంచలయ్య, భాస్కర్, చిన్నపోతుల సుబ్బారావు, వల్లభనేని వెంకటరావు, కుసుమ కృష్ణవేణి, బాషా, అమీర్, బెజ్జం రామకృష్ణ, తిరువీఽధుల బాపనయ్య, తదితరులు పాల్గొన్నారు.
అత్యాచార ఘటనలో నిందితుల గుర్తింపు...?
యువతిపై సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులు నిందితులను గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి ఉన్నతాధికారులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాధితురాలి సెల్ఫోన్ను నిందితులు వేరే వారి ద్వారా విజయవాడలోని వన్టౌన్లో ఒకరికి తనఖా పెట్టగా, ఆ ఫోన్ను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆ ఫోన్ ఆధారంగా పోలీసులు ఘటనకు పాల్పడింది పాత నేరస్తులా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.