Covid XE variant వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు టీకాలు వేసుకోవాలి

ABN , First Publish Date - 2022-04-12T13:28:17+05:30 IST

కొన్ని దేశాల్లో కొవిడ్ కొత్త ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తమ కొవిడ్ -19 టీకా పూర్తి డోసులను వేయించుకోవాలని...

Covid XE variant వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు టీకాలు వేసుకోవాలి

కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి పిలుపు

బెంగళూరు: కొన్ని దేశాల్లో కొవిడ్ కొత్త ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తమ కొవిడ్ -19 టీకా పూర్తి డోసులను వేయించుకోవాలని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె సుధాకర్ పిలుపునిచ్చారు. కొన్ని విదేశాల్లో ఎక్స్ఈ వేరియంట్ కేసుల పెరుగుదల దృష్ట్యా కొవిడ్-19 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం అనంతరం మంత్రి డాక్టర్ సుధాకర్ విలేకరులతో మాట్లాడారు. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, యూకే, జర్మనీలతో సహా 8 వేర్వేరు దేశాల్లో ఎక్స్‌ఈ వేరియంట్ కేసులు పెరిగాయని మంత్రి చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్స్ఈ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో 8 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, కఠినమైన నిఘా, 10 రోజుల పాటు తప్పనిసరి నిర్బంధాన్ని అమలు చేయాలని  టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించింది. 


దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని డాక్టర్ సుధాకర్ చెప్పారు.జూన్, జులై నెలల్లో మరో కొవిడ్ -19 వేవ్‌ వస్తుందని కాన్పూర్ ఐఐటీ అంచనా వేసిందని, అందువల్ల ప్రజలంతా మాస్కులు  ధరించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలా మంది రెండవ డోస్ పూర్తి చేయలేదనే వాస్తవాన్ని ఆరోగ్య మంత్రి నొక్కి చెప్పారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.


Updated Date - 2022-04-12T13:28:17+05:30 IST