అక్కడ ఒక చిన్నారి కడుపు నింపేందుకు.. మరో చిన్నారిని అమ్మేస్తున్న తల్లిదండ్రులు.. వారి రోదనలు వర్ణనాతీతం!

ABN , First Publish Date - 2021-11-25T16:58:31+05:30 IST

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలనకు..

అక్కడ ఒక చిన్నారి కడుపు నింపేందుకు.. మరో చిన్నారిని అమ్మేస్తున్న తల్లిదండ్రులు..  వారి రోదనలు వర్ణనాతీతం!

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలనకు వంద రోజులు పూర్తయ్యింది. అఫ్ఘానిస్తాన్ పరిస్థితి గతంలో కన్నా మరింత దారుణంగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినగా, చాలామంది ప్రజలు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అఫ్ఘానిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఉజ్బెకిస్తాన్ సరిహద్దుల్లోని ఒక పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి అత్యంత రహస్యంగా మీడియాకు తెలిపింది. తాలిబన్ల పాలనకు వంద రోజులు పూర్తయ్యిందని, ఈ నేపధ్యంలో ఇక్కడి ప్రజల పరిస్థితులు మరింత దిగజారాయన్నారు. ప్రతీ రోజూ యుద్ధవాతావరణాన్ని చూస్తున్నామని వాపోయారు.


యూనివవర్శిటీలో చదువుతున్న తాను తాలిబన్ల అరాచక పాలన కారణంగా మధ్యలోనే చదువు మానేయాల్సివచ్చిందని తెలిపారు. తామంతా ఇళ్లలోనే బందీలుగా ఉంటున్నామని, కనీసం వీధి ముఖం చూసే సాహసం కూడా చేయలేకపోతున్నామన్నారు. దేశంలోని చాలామంది పిల్లలు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపడం లేదు. తాముంటున్న ఈ ప్రాంతంలో చలి తీవ్రంగా ఉంటుందని, ఈ చలిని తట్టుకునే విధంగా సౌకర్యాలు సమకూర్చుకునేందుకు ఇక్కడ ఎవరికీ స్థోమత లేదన్నారు. ఎవరైనా ఆహారం పెడతారేమోననే పరిస్థితుల్లో ఇక్కడివారు కాలం గడుపుతున్నారన్నారు. కొన్ని కుటుంబాల వారు ఆహారం సమకూర్చుకునేందుకు ఇంటిలోని చిన్నారులను అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నారులు, వారి తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతమన్నారు. తాను ఇంట్లో విద్యార్థులకు చదువు చెబుతుంటానని, ఈ నేపధ్యంలో చిన్నారులు వారి ఇంటి గురించి చెప్పినప్పుడు ఎంతో బాధకలుగుతుందన్నారు. తమ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయోనని ఎదురు చూస్తున్నామన్నారు. 


Updated Date - 2021-11-25T16:58:31+05:30 IST