100మంది పాక్ టెర్రరిస్టులను విడిచిపెట్టిన తాలిబన్లు

ABN , First Publish Date - 2021-08-21T16:56:44+05:30 IST

ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువైనట్లు సంకేతాలు అందుతున్నాయి. ఎక్కడికక్కడ..

100మంది పాక్ టెర్రరిస్టులను విడిచిపెట్టిన తాలిబన్లు

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువైనట్లు సంకేతాలు అందుతున్నాయి. ఎక్కడికక్కడ విదేశీ ఉగ్రమూకలైన జైష్-ఏ-మహమ్మద్, ఐసిస్ వంటి టెర్రరిస్ట్ గ్రూపులు ఇప్పటికే ఆఫ్ఘన్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు ముప్పు పొంచి ఉందనే వార్తలూ వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పటికే పాకిస్తాన్, చైనాలు భారత్‌పై కాలుదువ్వుతుండడం, మరోపక్క తాలిబన్లకు బహిరంగంగానే మద్దతు పలుకుతుండడంతో భారత్ అడకత్తెరలో చిక్కుకున్నట్లుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మరో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. గతవారంతంలో ఆఫ్ఘన్‌ను పూర్తిగా వశం చేసుకున్న తాలిబన్లు.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆఫ్ఘన్ జైళ్లలోని ఉగ్రవాదులపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అనేకమంది ఉగ్రవాదులను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. 


 ప్రధానంగా ఇన్ని రోజులుగా ఆఫ్ఘన్ జైళ్లలో మగ్గుతున్న 100 మంది పాకిస్తాన్ తీవ్రవాదులను విడిచిపెట్టినట్లు సమాచారం. వీరంతా పాకిస్తాన్‌కు చెందిన తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి చెందిన వారిగా తెలుస్తోంది. విడుదలైన వారిలో సాధారణ తీవ్రవాదులతో పాటు టీటీపీ డిప్యూటీ చీఫ్ మహమ్మద్ ఫకీర్ మౌల్వి వంటి కీలక కమాండోలు కూడా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), అల్-ఖయిదా వంటి ఉగ్రమూకలకు సంబంధించిన వారిని కూడా విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-21T16:56:44+05:30 IST