ISIS సంగతి మేం చూస్తాం.... అమెరికా సాయం వద్దన్న తాలిబన్లు
ABN , First Publish Date - 2021-10-10T21:40:17+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)ను కట్టడి
ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)ను కట్టడి చేయడానికి తమకు అమెరికా సాయం అక్కర్లేదని తాలిబన్లు స్పష్టం చేశారు. కతార్ రాజధాని దోహాలో తాలిబన్ నేతలు, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చల నేపథ్యంలో తాలిబన్ అధికార ప్రతినిధి సుహాయిల్ షహీన్ రాజీ లేని ధోరణిని ప్రదర్శించారు. ఆఫ్ఘనిస్థాన్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులకు తమదే బాధ్యత అని ఐసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సుహాయిల్ షహీన్ ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐసిస్ను కట్టడి చేయడానికి అమెరికాతో కలిసి పని చేస్తారా? అని అడిగినపుడు ఆయన స్పందిస్తూ, ఐసిస్ను స్వతంత్రంగా ఎదుర్కొనే సత్తా తమకు ఉందని చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ 2014లో తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో ఏర్పడింది. ఇది ఐసిస్కు అనుబంధంగా ఏర్పాటైంది. అప్పటి నుంచి షియాలపై దాడులు చేస్తోంది. అమెరికన్ టార్గెట్లపై కూడా దాడి చేస్తోంది. ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత తొలిసారి దోహాలో తాలిబన్లు, అమెరికన్లు చర్చలు జరుపుతున్నారు. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ముందు జరిగే ప్రక్రియగా ఈ చర్చలను పరిగణించరాదని అమెరికా స్పష్టం చేసింది. పాకిస్థాన్ నేతలతో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ షెర్మన్ రెండు రోజులపాటు జరిపిన చర్చల నేపథ్యంలో తాలిబన్, అమెరికన్ ప్రతినిధుల మధ్య చర్చలు శనివారం ప్రారంభమయ్యాయని దోహా మీడియా తెలిపింది.