తమిళనాడు మెడికల్ కాలేజీ డీన్ తొలగింపు
ABN , First Publish Date - 2022-05-02T17:52:03+05:30 IST
తమిళనాడులోని మదురై ప్రభుత్వ మెడికల్ కాలేజీ తొలి సంవత్సరం విద్యార్థులు ప్రాచీన ఆయుర్వేద వైద్యుడు..
మదురై: తమిళనాడులోని మదురై ప్రభుత్వ మెడికల్ కాలేజీ తొలి సంవత్సరం విద్యార్థులు ప్రాచీన ఆయుర్వేద వైద్యుడు చరకుడి మీద ప్రమాణం చేసిన ఘటన వివాదానికి దారితీయడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. మెడికల్ కాలేజీ డీన్ ఎ.రత్నవేల్ను బదిలీ చేసింది. పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది.
మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన విద్యార్థులు చరకుడి పేరు మీద సంస్కృతంలో ప్రమాణం చేయడం వివాదానికి కారణమైంది. వైద్యశాస్త్ర పితామహుడుగా చెప్పుకునే హిపోక్రేట్స్ పేరిట ప్రమాణం చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇందుకు భిన్నంగా 'చరక్ శపథ్' పేరు మీద ప్రమాణం చేయడం నిబంధనలకు విరుద్ధమని రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు. అయితే విద్యార్థులు తమంత తామే ప్రమాణస్వీకారం చేసినట్టు డీన్ తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ నేత నారాయణన్ తిరుపతి స్పందిస్తూ, డీన్ తొలగింపు రాజకీయ చర్యగా పేర్కొన్నారు. ప్రమాణం చేయడం ఐచ్ఛికమని కేంద్రం చెబుతోందని, డీన్ను సస్పెండ్ చేయాల్సిన అవసర ఏమి వచ్చిందని ప్రశ్నించారు. పాశ్చాత్య మోడల్ అంటే డీఎంకేకు తగని మక్కువని అన్నారు.